Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
కాసరగోడ్: నరేంద్రమోడీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగ సంస్థలన్నిటికీ మరణగంట మ్రోగించినట్టేనని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ సంస్థలపై దాడి ప్రారంభమైందని ఆయన అన్నారు. మోడీ సర్కారే తిరిగి కేంద్రంలో అధికారం చేపడ్తే సమాజంలోని ధనికులకూ పేదలకూ మధ్య అంతరం మరింత పెరుగుతుందని ఏచూరి అన్నారు. కేరళలోని ఉత్తర ప్రాంతంలో సంరక్షణ యాత్ర ప్రారంభించిన సందర్భంగా ఏచూరి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్న యాత్రకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కణం రాజేంద్రన్ నేతృత్వం వహిస్తున్నారు. కేరళలో రెండు యాత్రలు నిర్వహిస్తున్నారు. దక్షిణ ప్రాంత యాత్రను తిరువనంతపురంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ప్రారంభించారు. ఆ యాత్రకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ రెండు యాత్రలు మార్చి 2న త్రిసూర్లో ముగియనున్నాయి.
పుల్వామా సంఘటనను మతపరంగా చూడొద్దని, దీనిపై రాజకీయాలు చేయొద్దని ఏచూరి విజ్ఞప్తి చేశారు. జవాన్లపై జరిగిన దాడిని ఉగ్రదాడిగానే చూడాలని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ దేశం ఐక్యంగా నిలువాలని ఏచూరి కోరారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో శబరిమల అంశం ప్రభావం చూపబోదని ఆయన అన్నారు. బెంగాల్లో కమ్యూనిస్టులకు రాజకీయ వైరిపక్షాలుగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని ఆయన తెలిపారు. తమ ప్రధాన లక్ష్యం బీజేపీని ఓడించడమే అయినప్పటికీ, కాంగ్రెస్తో ఎలాంటి ఒప్పందాలు లేవని ఏచూరి తెలిపారు. జరిగే పరిణామాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు.