Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహారంపైనా రాజకీయమే..
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బడి పిల్లలకు గుడ్డులేని భోజనం
- 'అక్షయపాత్ర' కార్యక్రమాలకు ప్రధాని మోడీ ప్రాధాన్యత
- పౌష్టికాహార లోపమున్నా...గుడ్డు వద్దంటూ నిర్ణయాలు
న్యూఢిల్లీ : బడికివెళ్లే బాలలకు అందించే ఆహారం విషయంలోనూ బీజేపీ నాయకులు రాజకీయాలకు తెరలేపుతున్నారా? బడిపిల్లలకు ప్రధాని మోడీ మధ్యాహ్న భోజనం తినిపిస్తూ కేవలం శాఖాహారాన్నే ఇవ్వటం వెనుక ఏదైనా వ్యూహముందా? అంటే రాజకీయ విమర్శకులు అవుననే అంటున్నారు. 'శాఖాహారమే' అన్నివిధాలా మంచిదన్న వాదనకు ఉత్తరాది రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బడిపిల్లలు పెద్ద ఎత్తున పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారని స్వయంగా కేంద్ర మానవాభివృద్ధి శాఖ చెబుతుంటే, మరోవైపు యూపీతో సహా 11 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీ, పాఠశాల మధ్యాహ్న భోజనంలో పిల్లలకు గుడ్డు, బలమైన ఆహారాన్ని దూరం చేస్తున్నారు. దేశంలో 40శాతం బడిపిల్లలు ఖాళీ కడుపుతో పాఠశాలలకు వస్తున్నారనీ, గుడ్డు, బలమైన ఆహారాన్ని ఇవ్వటం ద్వారా బడిపిల్లల్లో పౌష్టికాహారలోపాన్ని తగ్గించవచ్చుననీ కేంద్ర ప్రభుత్వం సహా అనేక సంస్థలు నివేదికలు అందించాయి. దీనికి విరుద్ధంగా 'సాత్విక ఆహారం'పేరుతో మోడీ సర్కార్ ఆహారంపై రాజకీయాలకు తెరలేపిందని విమర్శలు వెల్లువెత్తాయి.
యూపీలో హిందూ మత సంస్థ 'అక్షయ పాత్ర' నేతృత్వంలో పాఠశాల మధ్యాహ్న భోజన ప్రారంభోత్సవ కార్యక్రమం ఇటీవల ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రధాని మోడీ చేతులమీదుగా ప్రారంభించటం దేశవ్యాప్తంగా మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ బడి పిల్లలకు గుడ్డుపెట్టకుండా, కేవలం శాఖాహారాన్నే వడ్డించారు. ఉల్లి, వెల్లుల్లి, గుడ్డు లేకుండా తయారుచేసిన ఆహారాన్ని పలు నగరాల్లోని ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు 'అక్షయపాత్ర' అందిస్తోంది. శాఖాహారం, సాత్విక ఆహారమే సరైనదనీ, సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చేదనీ ప్రాచుర్యం చేస్తోంది. దాంట్లో భాగంగానే 'అక్షయపాత్ర' నేతృత్వంలోని కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారని తెలుస్తోంది.
సాత్విక ఆహారం పేరుతో 'అక్షయ పాత్ర' అమలుజేస్తున్న కార్యక్రమాన్ని 11 బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలుజేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బడిపిల్లల్లో పెద్దఎత్తున పౌష్టికాహార లోపమున్నదని తెలిసికూడా, అంగన్వాడీలకు గుడ్ల సరఫరాపై నిషేధం విధించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ వచ్చాక, అక్కడ మధ్యాహ్న భోజనంలో గుడ్డును మెనూ నుంచి తీసేశారు. గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్న జార్ఖాండ్లో ముఖ్యమంత్రి ఎలాంటి సంప్రదింపులు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. వారానికి మూడు గుడ్లు కాకుండా రెండు గుడ్లు ఇస్తే సరిపోతుందని నిర్ణయించారు.
బడిపిల్లలకు గుడ్డు, పౌష్టికాహారం అందిస్తున్న రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు మెరుగ్గా ఉన్నాయని మొన్నటి 'హెచ్ఆర్డీ' నివేదికే తేల్చింది. అందువల్లే ఈ రాష్ట్రాల్లోని పౌష్టికాహార లోపం చాలా చాలా తక్కువగా నమోదైంది. కర్నాటకలో పాత పద్ధతుల్ని మార్చాలని సీఎం కుమారస్వామి ఆదేశించారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో కొత్త ప్రభుత్వాలు వచ్చాక, పాత విధానాల్ని రద్దు చేశారు. బడి పిల్లలకు గుడ్డు అందజేయాల్సిందేనని నిర్ణయించారు. ఢిల్లీలో భోజన పథకాన్ని అమలుజేయటానికి 'అక్షయపాత్ర' పెద్ద ఎత్తున ప్రణాళికలు వేస్తుండగా, అక్కడ అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం గుడ్డు తప్పకుండా మెనూలో ఉంటుందని ప్రజలకు వాగ్ధానం చేసింది. విస్త్రతమైన వనరులున్న మహారాష్ట్ర కూడా కేవలం 16జిల్లాల్లో మాత్రమే గుడ్డును సరఫరా చేస్తోంది.
హెచ్ఆర్డీ చెప్పినా...
- రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్లలో సహజంగానే ప్రజల్లో శాఖాహార అలవాట్లు అనాదిగా వస్తున్నాయి. దీంతో హర్యానా, రాజస్థాన్ గుడ్డుకు బదులుగా బడిపిల్లలకు పాలు, ఖీరా అందిస్తున్నాయి. అయినప్పటికీ లోపాన్ని తగ్గించలేకపోయారు.
- బడిపిల్లలకు పాలు, తేనె అందించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. పెద్దఎత్తున పాలపొడి మిగులు ఉత్పత్తులున్నాయని ఈ లేఖలో పేర్కొన్నది. కానీ ఇందుకోసం నిధులు మాత్రం రాష్ట్రాలకు విడుదల చేయలేదు.
- శ్వేత(పాల) విప్లవం వచ్చినప్పటికీ గుజరాత్లో పౌష్టికాహార లోపాన్ని తప్పించలేకపోయారు. పౌష్టికాహారలోపంతో బాధపడుతున్న బడిపిల్లలు గుజరాత్లో అత్యధికంగా ఉన్నారని తేలింది.
- నేటి బాలలు పౌష్టికాహారం తీసుకుంటేనే, భవిష్యత్తు భారతం మరింత శక్తివంతంగా ఉంటుంది. అంగన్ వాడీల్లో, పాఠశాల మధ్యాహ్న భోజనంలో బలమైన ఆహా రం, గుడ్లు అందిస్తేనే నేటి బాలలు అన్నివిధాలా ఆరోగ్య వంతులవుతారు. మంచి చదువరులవుతారు. 2019 సార్వత్రిక ఎన్నికలవేళ తమ ఎన్నికల మ్యానిఫెస్ట్టోలో బడిపిల్లలకు గుడ్డు, బలమైన ఆహారం అందిస్తామన్న వాగ్దానం మిగతా పార్టీలు చేయాల్సిన తరుణం వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.