Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శాసనమండలి సభ్యుడిగా తాను అనర్హుడునని పేర్కొంటూ శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని కోరుతూ ఆర్.భూపతిరెడ్డి దాఖలు చేసిన కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, శాసన మండలి చైర్మన్, మండలి కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, పే అండ్ అకౌంట్స్ అధికారులతోపాటు భూపతిరెడ్డిపై ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్రెడ్డి, బి.వెంకటేశ్వర్లకు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఎమ్మెల్సీ అనర్హత నిర్ణయాన్ని సవాల్ చేసిన వ్యాజ్యంలో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల్ని సవాల్ చేస్తున్నందున పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని సోమవారం డివిజన్ బెంచ్ ప్రకటించింది. ఆ నిబంధనలు పారదర్శకంగా లేవని, ఇవి రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అనర్హులుగా ప్రకటించాలనే ఫిర్యాదు అందాక విచారణకు ఒక కమిటీ ఏర్పాటు చేయకుండా నేరుగా మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవడం చెల్లదని భూపతిరెడ్డి తరపున ఆయన లాయర్ వాదించారు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనందున ఆయన ఏపార్టీకి చెందిన వారు కాదన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ అంశాల్ని పిటిషనర్ సవాల్ చేశారని, దీనిపై కేంద్రం ప్రభుత్వం పూర్తి వివరాలు అందజేయాలని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.