Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మాంసం ఎగుమతుల కోసం జంతు వధను నిషేధించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జంతువులపై హింస నిరోధక చట్టం ప్రకారం ఈ నిషేధం విధించాలని వ్యాజ్యం పేర్కొంది. కాగా, సీజేఐ రంజన్ గొగోరు, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించబోదని తెలుపుతూ డిస్మిస్ చేసింది. హెల్తీ వెల్తీ ఎథికల్ వరల్డ్ గైడ్ ఇండియా ట్రస్ట్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం.. మాంసం, మాంస ఉత్పత్తుల(లెదర్ మొదలైనవి) ఎగుమతులను నిలిపేసేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు రంగ పరిశ్రమలకు మార్గదర్శకాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరింది. ముడి లెదర్, మాంసం సంబంధిత ఉత్పత్తుల తయారీ, అమ్మకాలను నిలిపేయాలనీ విజ్ఞప్తి చేసింది. ఆర్టికల్ 51ఏ ప్రకారం.. ప్రకృతి, ప్రాణులపట్ల సానుకూలంగా వ్యవహరించే బాధ్యత పౌరులకుంటుందని తెలుపుతూ స్థానిక ప్రజల ఆహార అవసరాల మేరకు మాత్రమే జంతువులను వధించవచ్చుననే చట్టం చెబుతుందని వివరించింది. ఉత్పత్తులకోసం, మాంసం ఎగుమతి కోసం జంతువులను వధించడాన్ని నిషేధించాలని కోరింది.
'ఈ దశలో ఆ పిటిషన్ను విచారించబోం'
ఎస్సీ వర్గానికి చెందినవారిని 'దళితులు' అని సంబోధించరాదని గతేడాది కేంద్రం జారీ చేసిన సర్క్యూలర్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. దళితులు అనే పదానికి బదులు ఎస్సీలు అనే పదాన్ని వాడాలని మీడియాకు 2018 ఆగస్టులో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ జారీ చేసిన అడ్వైజరీని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారించబోదని సీజేఐ రంజన్ గొగోరు, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం తెలిపింది. పిటిషనర్ విఎ రమేశ్ నాథన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. ఆ సర్క్యూలర్ చట్టబద్ధతను ప్రశ్నించారు. తమ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వం అలాంటి సర్క్యూలర్ను ఎలా జారీ చేస్తుందని అడిగారు. కాగా, ఈ దశలో తాము ఈ పిటిషన్ విచారించబోమని న్యాయమూర్తులు చెబుతూ.. పిటిషన్ను డిస్మిస్ చేశారు. మీడియా, దళిత పదాన్ని వాడరాదని సూచించిన ఆ సర్క్యూలర్.. అన్ని అధికారిక లావాదేవీలు, డీలింగ్స్, సర్టిఫికేట్ల విషయంలోనూ షెడ్యూల్ట్ క్యాస్ట్ అనే వాడాలని నిర్దేశించింది.
స్టెరిలైట్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సుప్రీం తిరస్కరణ
వేదాంతకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడులోని వివాదాస్పద తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) డిసెంబరు 15న ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని వేదాంత గ్రూపుకు సూచించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలుపరిచేలా తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ వేదాంత గ్రూప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సోమవారం పై తీర్పునిచ్చింది.
మెడికల్, లీగల్ విద్య అపహాస్యాన్ని అనుమతించం
దేశంలో మెడికల్, లీగల్ విద్యను అపహాస్యం చేయడాన్ని అనుమతించబోమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. విద్య నాణ్యతపట్ల గేమ్ ఆడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. కొందరికి ఇది డబ్బును ఆర్జించే మార్గం కావచ్చు, గానీ న్యాయస్థానానికి విద్య నాణ్యతే ప్రధానమని తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని ఒక మెడికల్ కాలేజీలో తనిఖీలు నిర్వహించేందుకు అనుమతించలేదని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) తెలపడంతో న్యాయమూర్తులు ఎస్ఎ బాబ్డే, దీపక్ గుప్తాల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలున్నా తనిఖీ బృందాన్ని కాలేజీ తిరస్కరించిందని ఎంసీఐ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. ఇలాంటి ఒక కాలేజీలోని లోపాలు.. ఒకరిని జైలుకు పంపేస్థాయిలో ఉండే అవకాశముందని న్యాయవాది అభిప్రాయపడ్డారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఒకవేళ అలాంటి కాలేజీలుంటే వాటికి వచ్చే ఏడాది అడ్మిషన్లు కల్పించే అనుమతిని నిరాకరించాలని తెలిపింది. కాగా, ఎంసీఐ దాఖలు చేసిన నివేదికకు నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ మూడు రాష్ట్రాల్లోని ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో లోపాలున్నాయని కేంద్రం విధించిన నిషేధాన్ని గతేడాది సుప్రీంకోర్టు తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాలు నిర్దేశించుకున్న సమయంలో ఆ కాలేజీల్లో ఎంసీఐ లేవనెత్తిన లోపాలు సరిదిద్దే బాధ్యతలను ఆ రాష్ట్రాల సీఎస్, వైద్య విద్య బాధ్యులైన ప్రిన్సిపల్ సెక్రెటరీకి అప్పగించింది. అలాగే ఆ లోపాల దిద్దుబాటును మూడు నెలల తర్వాత పరిశీలించాలని ఎంసీఐని ఆదేశించింది.
ఆర్టికల్ 370పై పిల్ విచారణకు సుప్రీం ఓకే
వచ్చేవారం కోర్టు ముందుకు వచ్చే అవకాశం
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్కు ప్రత్యేకమైన ఆర్టికల్ 370పై దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్) విచారణకు సుప్రీం గ్రీన్సిగల్ ఇచ్చింది. ఈ ఆర్టికల్ జమ్మూకాశ్మీర్కు ప్రత్యేకహౌదాను కల్పిస్తుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి చట్టాలు చేసే విషయలో దేశ పార్లమెంటుకు పరిమితులూ విధిస్తుంది. అలాంటి 370 ఆర్టికల్పౖౖె 'తక్షణ విచారణ' జరపాలంటూ గత సెప్టెంబరులో బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే పిల్ను విచారించబోతున్నట్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోరు, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తెలిపింది. 'లిఖితపూర్వక పత్రాన్ని రిజిస్ట్రార్కు అందించండి. పిల్పై విచారణ జరుపుతాం' అని ఈ సందర్భంగా ధర్మాసనం చెప్పింది. జమ్మూకాశ్మీర్కు కల్పించిన ఆర్టికల్ 370 రాజ్యాంగ విరుద్దమైనదని, దాని చట్టబద్దతను సవాలు చేస్తూ బీజేపీ నాయకుడు అశ్వనీ ఉపాధ్యాయ తన పిల్లో ప్రధానంగా ప్రస్తావించారు. అయితే పిల్ విచారణ మాత్రం వచ్చేవారం కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉన్నదని సమాచారం.