Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' పై సర్వత్రా అసంతృప్తి
- రైతు రుణమాఫీపై ఎన్నో ఆశలు
- పడిపోతున్న పంటధరలు..
- పెరుగుతున్న కుటుంబ అవసరాలు
- సంక్షోభంలో చిక్కుకున్న రైతుకు దొరకని ఉపశమనం
మొన్నటి తాత్కాలిక బడ్జెట్లో మోడీ సర్కార్ ప్రకటించిన రైతు పథకం 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి'. దీని ద్వారా ఒక రైతు కుటుంబానికి ఏడాదికి ఇస్తామంటున్న సాయం రూ.6వేలు. ఇది కూడా మూడు వాయిదాలలో రూ.2వేల చొప్పున ఇస్తామన్నారు. ఇంతచిన్న మొత్తంతో రైతు పెట్టుబడి వ్యయం ఎలా సర్దుబాటు అవుతుంది? అని క్షేత్రస్థాయిలో వ్యవసాయదారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోసమైనా ఏదైనా చేస్తారని చూసిన దేశ రైతాంగానికి తీవ్ర నిరాశే ఎదురైందని వ్యవసాయరంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ రైతులకు ఏమీ చేయలేదు...అన్న అపప్రద నుంచి బయటపడటానికి, 'ఎన్నికల లక్ష్యా'ల్ని దృష్టిలో ఉంచుకొని తయారుచేసిన పథకమే 'పీఎం కిసాన్ సమ్మాణ్ నిధి'. అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి ఏటా రూ.6వేలు ఇస్తామని ఇందులో కేంద్రం ప్రకటించింది. కూరగాయలు పండించే ఒక చిన్న రైతుకు, వాటి విత్తనాల కొనుగోలుకే రూ.5వేలు ఖర్చువుతున్న ఈరోజుల్లో రూ.6వేల సాయం ఏమేరకు సరిపోతుందన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఆలుగడ్డలు, టమాటాలు...మొదలైన కూరగాయ పంటల్ని సాగు చేసే రైతుకు గిట్టుబాటుధర రాకపోవటం పెద్ద సమస్య. దీనిపై యూపీలోని మీరట్ రైతు ఇలా అంటున్నాడు...''ఆలుగడ్డలు పండించాను. హోల్సేల్ మార్కెట్కు నా పంటను తీసుకెళ్లి అమ్మితే కిలో.రూ.6 పలికింది. పంటపై పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం ప్రతీ ఏటా దీనిపై మాటలు చెప్పటం తప్పితే చేసేదేమీ లేదు. ఇప్పుడు మరో కొత్త పథకాన్ని ప్రకటించారు''అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'కిసాన్ క్రెడిట్ కార్డ్'పై లక్షన్నర రూపాయలు అప్పు ఉండటం సర్వసాధారణమైన అంశం. అలాంటి రైతులకు 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' ఏవిధంగా ఆదుకుంటుందనీ ఆయన ప్రశ్నించాడు.
'ఆపరేషన్ గ్రీన్' ఏమైంది?
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018 బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమ యంలో 'ఆపరేషన్ గ్రీన్' అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. రూ.500కోట్లు కేటాయిస్తున్నామనీ, టమాటా, ఉల్లి, ఆలూ...మొదలైన కూరగాయ రైతు లకు గిట్టుబాటు ధర కల్పించటం కోసం...ఈ కార్యక్రమాన్ని ఎంచుకు న్నామనీ అన్నారు. హోల్సేల్ మార్కెట్ ఒడిదొడుకుల నుంచి రైతుల్ని కాపాడుతుందనీ, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, ప్రాసెసింగ్ సదుపా యాలు, నిర్వహణ అంతా ప్రభుత్వమే చేపడుతుందనీ జైట్లీ ఆనాడు చెప్పా రు. ఈ పథకానికి నవంబరు, 2018లో కేంద్రం ఆమోదం తెలిపింది.
ఏడాది దాటినా 'ఆపరేషన్ గ్రీన్' కార్యక్రమంలో కనీసం అడుగు కూడా పడలేదు. అక్కడక్కడా 'కోల్డ్ స్టోరేజ్'లు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 'ఇదిగో రైతులకు గిట్టుబాటు ధర దక్కింది'అన్న ఫలితం ఒక్కటీ లేదు. కూరగాయలు సాగుచేసే రైతుల మళ్లీ మొదటికొచ్చాయి. మొన్నటి తాత్కాలిక బడ్జెట్లో పియూష్ గోయల్ 'ఆపరేషన్ గ్రీన్' ప్రస్తావనే తేలేదు.
ఎంతో ఎదురుచూశాం..
గతకొన్నేండ్లుగా పంటలకు న్యాయమైన గిట్టుబాటు దక్కటం లేదు. మరోవైపు కుటుంబానికి విద్య, వైద్య అవసరాలు పెరిగాయి. విద్యుత్ ఖర్చులూ పెరిగాయి. ఇతర వస్తు, సేవలకు రైతు అధిక ధర చెల్లించాల్సి రావటం సంక్షోభాన్ని పెంచాయి. వ్యవసాయం చేయాలంటే చేతిలో చిల్లగవ్వ లేని పరిస్థితి ఏర్పడింది. ఏదో ఒకరోజు కేంద్రం రుణ మాఫీ ప్రకటించకపోతుందా? కొంతలో కొంత ఒడ్డున పడకపోతామా? అన్న ఆశలతో ఇంతదాకా ఎదురుచూశారు. అలాంటివారిని కేంద్రం నేడు తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది.
ఆదాయం పడిపోయింది...అవసరాలు పెరిగాయి
- సామాజిక శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు యోగేంద్ర యాదవ్
గతకొన్నాండ్లుగా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ అనుకూలంగా లేదు. తమ పరిధిలోలేని అంశాలకు రైతులు బలవుతున్నారు. మరోవైపు వారి కుటుంబ అవసరాలు పెరిగిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలపాటు ఈ పరిస్థితులు కొనసాగినా కేంద్రం సరైన దృష్టి పెట్టలేదు. విద్య, వైద్య అవసరాలు ఎలా తీరుతాయన్న ఆందోళన రైతు కుటుంబాల్లో పెరుగుతోంది. యూపీలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ బిల్లులను 150శాతం పెంచింది.
గ్రామీణ భారతంలో 78శాతం రైతు కుటుంబాలు 'అత్యవసర ఆరోగ్య' సమస్యలు వేధిస్తున్నాయి. వీరి అవసరాల్ని తీర్చే విధంగా ఎక్కడా కూడా ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో లేవు. ఓవైపు వ్యవసాయం సరిగాలేక, మరోవైపు కుటుంబ ఆరోగ్య సమస్యలు రైతుల్ని తీవ్రంగా కుంగదీస్తున్నాయి.