Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేజర్, నలుగురు జవాన్లు మృతి
- 'పుల్వామా' సూత్రధారి సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి చేదు వార్తను మరవక ముందే దక్షిణ కాశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో మరో ఐదుగురు జవానులు ప్రాణాలొదిలారు. ముగ్గురు జేషే ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అయితే ఇందులో పుల్వామా ఘాతుకానికి సూత్రధారిగా భావిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జేషే చీఫ్ ఆపరేషనల్ కమాండర్ కూడా ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామా దాడి ఘటనకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పింగ్లాన్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నది. ఆ ప్రాంతంలో ముగ్గురు జేషే ఉగ్రవాదులున్నారన్న సమాచార పోలీసులకు అందింది. దీనితో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా 55 రాష్ట్రీయ రైఫిల్స్, రెండు బెటాలియన్ల సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు జమ్మూకాశ్మీర్ పోలీసులకు చెందిన ప్రత్యేక ఆపరేషన్ గ్రూపు రంగంలోకి దిగింది. అనంతరం ఉగ్రవా దులు, భద్రతా సిబ్బం దికి మధ్య 18గంటల పాటు ఎన్కౌంటర్ చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 55రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఓ అధికారితో పాటు నలుగురు సైనికులు మరణించారు. వారిని డెహ్రాడూన్ కు చెందిన మేజర్ విభుతి శంకర్ ధౌండియల్ (34), హరిసింగ్ (27), షియోరాం(37), అజరుకుమార్ (27)లు ఉన్నారు. ఈ ఎన్కౌంటర్లో ఒక పౌరుడికి తీవ్రగాయాలయ్యా యని భద్రతా బలగాలు వెల్లడించాయి.
పుల్వామా దాడి ఘటనకు ప్రతీకారంగా భద్రతా బలగాలు ఉగ్రవాదులకు తగిన సమాధానమిచ్చాయి. సైనికులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జేషే ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన ఉగ్రవాదుల్లో
పాకిస్తాన్ జైషే చీఫ్ మసూద్ అజహర్ ప్రధాన సహాయకుడు, పుల్వామా సూత్రధారి కమ్రాన్ ఉన్నాడు. అలాగే మరో ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు కాశ్మీర్ బాంబ్ స్పెషలిస్ట్గా పేరున్న హిలాల్ అహ్మద్గా పోలీసులు గుర్తించారు. ఇంకొకరిని గుర్తించాల్సి ఉన్నదని పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు జైషే ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్కు చెందిన టాప్ కమాండర్ అని రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా తెలిపారు. వీరికి పుల్వామా ఘాతుకంతో సంబంధమున్నట్టు చెప్పారు. కమ్రాన్.. కాశ్మీర్లోయలో ఉగ్రవాదులను నియమిస్తూ, వారికి శిక్షణనిచ్చేవాడని పోలీసులు తెలిపారు. అలాగే పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై సూసైడ్ బాంబర్ అదిల్ అహ్మద్ దార్ ఆత్మాహుతిదాడికి కూడా కమ్రానే పథకం రచించినట్టు పోలీసులు చెప్పారు. కాగా, ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భద్రతా బలగాలు ఒక ఏకే-47ను స్వాధీనం చేసుకున్నాయి. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు అసువులుభాసిన ఘటన దేశాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచిన విషయం తెలిసిందే.