Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుడ్గవర్నెన్స్ పేరిట పౌరులపై సాంకేతిక కన్ను
రాజ్యాంగం కల్పించిన పౌరస్వేచ్ఛపై ఎలాగైనా నిఘా పెట్టాలని మోడీ సర్కార్ యత్నిస్తూనే ఉన్నది. సుప్రీం కోర్టు అక్షింతలు వేశాక.. మరో దారిలో పౌరులపై కృత్రిమ నిఘా పెట్టడానికి యత్నాలు చేస్తున్నది. తాజాగా గుడ్గవర్నెన్స్ పేరిట కృత్రిమ మేథస్సు పేరిట సాంకేతికపై దృష్టి పెట్టింది.పైకి మాత్రం పాలన కోసమే అంటున్నా... ఇది వ్యక్తిగత సమాచారానికి భంగమేనని విశ్లేషకులు అంటున్నారు.
న్యూఢిల్లీ: డిజిటల్ మాధ్యమంలో పౌరుల సమాచార నిర్వహణ కోసం పెద్ద ఎత్తున కృత్రిమ మేథస్సును వాడటానికి కేంద్రం సిద్ధమవుతోంది. అయితే దీనివల్ల పౌరుల వ్యక్తిగత సమాచారం మరింత ప్రమాదంలో పడుతుందనీ, పాలకుల నిఘా పెరుగుతుందనీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు, సాంకేతిక నిపుణులు అంటున్నారు. పౌరుల వ్యక్తిగత సమాచారంపై పట్టుసాధించే దిశగా కేంద్రం అడుగులువేస్తోందని వారు విశ్లేషించారు. ప్రభుత్వ పాలనను మరింత మెరుగుపర్చడం కోసమే కొత్త విధానాల్ని తెస్తున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో కృత్రిమ మేథస్సుతో డిజిటల్ మాధ్యమాన్ని మరింత సమర్థవంతం చేస్తామనీ, న్యాయ, నియంత్రణా వ్యవస్థల్ని కూడా మెరుగుపరుస్తామనీ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
'కృత్రమ మేథస్సు' అన్న అంశంపై సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో సురేష్ప్రభు మాట్లాడుతూ...''ఆన్లైన్లో సమాచార రవాణా అన్నది అమెరికా, చైనాలకన్నా భారత్లో ఎక్కువగా జరుగుతోంది. ఇంతపెద్ద సమాచారాన్ని ఆరు ప్రఖ్యాత కంపెనీలు నిర్వహిస్తున్నాయి. కృత్రిమ మేథస్సు సాంకేతిక పరిజ్ఞానంపై ఎవరు పట్టుసాధిస్తారో రేపటి ప్రపంచాన్ని వారు శాసిస్తారు. ఈ ప్రాధాన్యత గుర్తించే, ప్రతీ దేశం తమదైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. భారతదేశం కూడా ఈ సాంకేతిక అభివృద్ధిపై దృష్టి సారించింది'' అని అన్నారు.
ప్రభుత్వాలు ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సమర్థవంతమైన పాలనను, సరైన నియంత్రణా వ్యవస్థలను ఏర్పాటుచేయబోతున్నట్టు ఆయన చెప్పారు. అదేసమయంలో పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతపై జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. డిజిటల్ మీడియాలో తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడానికి బలమైన న్యాయ పరిష్కార వ్యవస్థను కూడా తీసుకొస్తామన్నారు.
కేంబ్రిడ్జ్ అనలెటికా మరిచిపోయారా?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలన్నీ డిజిటల్ మాధ్యమంలో జరగటంపై కొంతమంది రాజకీయ, సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత కరువవుతుందనీ, సామాజిక మాధ్యమాల(ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్...)ద్వారా సేకరించిన సమాచారంతో పాలకులు ప్రజల్ని ప్రభావితం చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. 'కేంబ్రిడ్జ్ అనలెటికా' కుంభకోణమే దీనికి ఉదాహరణగా వారు చూపుతున్నారు. ఫేస్బుక్ నుంచి సేకరించిన సమాచారంతో వివిధ దేశాల్లోని రాజకీయాల్ని ప్రభావితం చేయడానికి కేంబ్రిడ్జ్ అనలెటికా ప్రయత్నించిందని వారు గుర్తుచేశారు.