Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైనిక అధికారుల హెచ్చరిక
కాశ్మీర్ : ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం తీవ్రంగా స్పందించింది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఎటువంటి సవాలులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇకపై ఎవరైనా ఆయుధంతో కాశ్మీర్లో కనిపిస్తే కాల్చి పడేస్తామని అధికారులు హెచ్చరించారు. పుల్వామా దాడి సూత్రదారులను సైన్యం హతమార్చిన నేపథ్యంలో మంగళవారం లెఫ్ట్నెంట్ జనరల్ కెజెఎస్ ధిల్లాన్, కాశ్మీర్ పోలీసులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. పుల్వామా దాడి జరిగిన కేవలం 100 గంటల్లోపే జైషే ఉగ్రవాద సంస్థ నాయకులను ఏరివేశామని ఆయన ప్రకటించారు. ఇకపై ఎవరైనా ఆయుధంతో కనిపిస్తే కాల్చిపడేస్తామని ఆయన హెచ్చరించారు. తమ పిల్లలు ఉగ్రవాద సంస్థల్లో చేరకుండా కాశ్మీరీ తల్లులు జాగ్రత్తలు తీసుకో వాలని కోరారు. టెర్రరిస్టుల గ్రూపుల్లో చేరిన వారిని వెనక్కు పిలుపిం చుకోవాలని సూచించారు. పుల్వామా దాడిలో పాక్ హస్తం కూడా ఉందని ఆయన ఆరోపించారు. పుల్వామా దాడిలో ఉగ్రవాదులు ఉపయోగించిన పేలుడు పదార్ధాలపై తమకు స్పష్టమైన సమాచారం ఉందని, కానీ విచారణ జరుగుతున్నందున వివరాలు వెల్లడించలేమని అన్నారు. స్థానిక యువకులు ఎక్కువగా ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్నారని, దీనికి వారి కుటుంబసభ్యుల ప్రోత్సాహం కూడా ఉంటోందని ఐ.జీ ఎస్పి పాని తెలిపారు. అయితే భద్రతా పరమైన కారణాల దృష్ట్యా వారి వివరాలు వెల్లడించమని ఆయన అన్నారు.