Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులపై కాల్పులు జరిపిన పోలీసులకు క్లీన్చిట్
- కమల్నాథ్ సర్కార్ నిర్ణయంపై రైతుల్లో ఆగ్రహం
భోపాల్ : మధ్యప్రదేశ్లోని మందసోర్ కాల్పుల ఘటనలో బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పాలనలోనైనా న్యాయం జరుగుతుందన్న ఆశలు అడియాశలయ్యాయి. బీజేపీకి తీసిరాజని తీరులో.. రైతులపై కాల్పులకు తెగబడిన పోలీసులకు కమల్నాథ్ సర్కారు క్లీన్చిట్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఇందుకు సంబంధించి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) ఆదేశాలు ఇచ్చారని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి బాలాబచ్చన్.. అసెంబ్లీలో సోమవారం వెల్లడించారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి క్లీన్చిట్ ఇవ్వడమేంటని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017 జూన్లో మందసోర్ జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కాగా.. జూన్ 6న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు కాల్పులకు తెగబడి ఆరుగురిని పొట్టన బెట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన ఏడాదైన సందర్భంగా(గతేడాది జూన్ 6న) రాహుల్గాంధీ.. మధ్యప్రదేశ్లో పర్యటించారు. చనిపోయిన రైతుల కుటుంబీకులను పరామర్శించి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. 'కాల్పులు జరిగి ఏడాది అవుతున్నా దర్యాప్తులో పురోగతి లేదు. పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబీకులు న్యాయం కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే.. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తాం' అని ఆనాడు నిర్వహించిన ర్యాలీలో రాహుల్ అన్నారు. కాగా.. రాష్ట్రంలో బీజేపీని ఓడించి గద్దెనెక్కిన కాంగ్రెస్.. తీరా చూస్తే బాధితులకు తీరని అన్యాయమే చేసింది. రాహుల్ ఇచ్చిన వాగ్దానానికి పూర్తి విరుద్ధంగా పోలీసులకు క్లీన్చిట్ ఇవ్వడం గమనార్హం. మేజిస్ట్రేట్ ఆదేశిస్తే తప్ప పోలీసులు ఫైరింగ్ చేయరాదని నిబంధనలున్నా.. ప్రభుత్వం ఈ విషయాన్ని పెడచెవిన పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.