Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల సమస్యల పరిష్కారంలో
- మోడీ విఫలం
- వర్సిటీల్లో శాశ్వత నియామకాలు చేపట్టాలి
- జంతర్మంతర్ ధర్నాలో
- నిలోత్పల్ బసు, డి రాజా డిమాండ్
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశ చౌకీదార్గా చెప్పుకొని ప్రధాని నరేంద్రమోడీ తన పాలనా హయాంలో విద్యారంగాన్ని పూర్తిగా నిరక్ష్యం చేశారని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నిలోత్పల్ బసు విమర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో ఆయన విఫలమైనట్టు వెల్లడించారు. మంగళవారం జేఎన్యూ టీచర్స్ అసోసియేషన్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐడీఎస్ఓ, ఏఐఎస్బీ, పీఎస్్యూ విద్యార్థి సంఘాల నేతృత్వంలో భారీ మార్చ్ జరిగింది. ''విద్యారంగాన్ని కాపాడాలి... దేశాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి'' అంటూ ఆందోళనా మార్చ్ జరిగింది. మార్చ్లో ''మోడీ హటావో... దేశ్ బచావో... విద్యా వ్యతిరేక విధానాలు నశించాలి. మతోన్మాద మోడీ సర్కార్ను ఓడించాలి'' నినాదాలు చేశారు. అనంతరం నిలోత్పల్ బసు మాట్లాడారు. విద్యారంగాన్ని మోడీ సర్కారు పూర్తిగా కాషాయీకరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలపై దాడి జరుగుతుందని అన్నారు. తీవ్రవాదుల మీద పెట్టాల్సిన కేసులు విద్యార్థులపై పెడుతున్న తీరును ఖండించారు. ఇచ్చిన హామీలను నిలుపుకోవడం మోడీ సర్కారు పూర్తిగా విఫలమైందని అందుకే దేశంలో ప్రతి రోజు ఆందోళనలు జరుగుతున్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ నిధులతో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత సాధారణ విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. విద్యా రంగానికి జీడీపీలో 6 శాతం, కేంద్ర బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాజ్యసభ సభ్యుడు డి. రాజా మాట్లాడుతూ... విద్యారంగ సమస్యల పరిష్కారంలో మోడీ సర్కార్ విఫలం అయ్యిందని, వర్సిటీల్లో మతోన్మాదుల బలం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యమాలు చేస్తే దేశద్రోహులంటూ ముద్ర వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సర్కార్కు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నారని, దళిత, గిరిజన, మైనార్టీ, వెనుకబడిన వర్గాలు ఆందోళను చేస్తున్నారని గుర్తు చేశారు. ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు మయూక్ బిశ్వాస్ మాట్లాడుతూ... శాస్త్రీయబద్ధంగా స్కూళ్ళు, కాలేజీలు, వర్సిటీల్లో విద్యా బోధన జరగాలని అన్నారు. మత విశ్వాసాల ఆధారంగా విద్య బోధన జరిగితే, దేశానికే ప్రమాదకరమని చెప్పారు.
విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మోడీ సర్కారును ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు సాయి బాలాజీ మాట్లాడుతూ... ప్రభుత్వ విద్యా సంస్థలను సర్కారు మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో శాశ్వత నియామకాలు చేపట్టాలని అన్నారు. విద్య వ్యాపారం కాదని... హక్కు అని స్పష్టం చేశారు. జాయింట్ ఫోరం ఫర్ మూమెంట్ ఆఫ్ ఎడ్యూకేషన్ కన్వీనర్ అమియా కుమార్ మోహంతీ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రయివేట్ సంస్థల్లో కూడా సామాజిక న్యాయం హామీ ఇవ్వాలని, సమాఖ్య విద్యా విధానాన్ని పరిరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి ఏఐడీిఎస్ఓ ప్రధాన కార్యదర్శి అశోక్ మిత్రా, ఏఐఎస్బీ కార్యదర్శి సౌమ్యదీప్ సర్కార్, పీఎస్యూ కన్వీనర్ ఎన్ఎం సఫీయుల్లా, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు వల్లీ ఉల్లా ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.