Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర అధికారులపై చర్యలకు సుప్రీంకోర్టులో 3 పిటిషన్లు
న్యూఢిల్లీ:రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో సీల్డ్ కవర్లో తప్పుడు సమాచారమిచ్చిన కేంద్ర ప్రభుత్వ అధికారులపై చర్యలు కోరుతూ సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. అసత్యాలతో కూడిన సమాచారమివ్వడం ద్వారా న్యాయ విచారణ పవిత్రతకు కేంద్ర ప్రభుత్వం భంగం కలిగించిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషన్లు వేసినవారిలో కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్సిన్హా, అరుణ్శౌరీ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్భూషణ్ ఉన్నారు. రూ.59,000 కోట్ల విలువైన రాఫెల్ డీల్లో విమానాల ధర, అనుసరించిన విధాన నిర్ణయానికి సంబంధించి కేంద్రం నుంచి వివరాల్ని సీల్డ్ కవర్లో ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 14న రాఫెల్ డీల్పై వచ్చిన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. 36 రాఫెల్ విమానాల కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరించిన విధానాన్ని తప్పు పట్టేందుకు తమకు ఏ ఆధారాలు కనిపించలేదని సుప్రీంకోర్టు ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. అయితే, కేంద్రం సమర్పించిన అఫిడవిట్లో కాగ్ నివేదికలోనూ ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదంటూ తెలిపారు. వాస్తవానికి అప్పటికింకా కాగ్ నివేదిక కేంద్రానికి అందలేదు. ఇదొక్కటే కాకుండా పలు తప్పుడు సమాచారాలను తన అఫిడవిట్లో కేంద్రం ఇచ్చినట్టు పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. రక్షణశాఖను పక్కన పెట్టి అధికార హౌదా లేకున్నా ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) ఈ డీల్పై ఫ్రాన్స్తో సమాంతర సంప్రదింపులు జరిపినట్టు ఇటీవల వెలుగు చూసిన విషయాల్ని కూడా పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.