Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డుల్లో చేర్చటానికి అనుమతించండి:ఏజీ
- లీకైన పత్రాలను పరిగణనలోకి తీసుకోవద్దు: కేంద్రం
- ' రాఫెల్ డీల్ ' పై సుప్రీంకోర్టులో వాద, ప్రతివాదాలు
- నిఘా సమాచారం మినహా ఏదీ రహస్యం కాదు
- సార్వభౌమ హామీ లేనప్పుడు ఇది ప్రభుత్వాల మధ్య ఒప్పందమెలా?:
పిటిషనర్ల తరఫు న్యాయవాది
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన దస్త్రాలపై కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ప్రత్యేక అధికారాలున్నాయని అటార్నీ జనరల్(ఏజీ) కెకె వేణుగోపాల్ తెలిపారు. రక్షణశాఖ అనుమతి లేకుండా ఆ పత్రాలను కోర్టులో ప్రవేశపెట్టే అధికారం పిటిషనర్లకు లేదని ఏజీ అన్నారు. ఈ ఒప్పందంపై కోర్టుకు గతంలో ప్రభుత్వం తరఫున ఇచ్చిన కాగ్ నివేదికలో మొదటి మూడు పేజీలు లేవని ఏజీ కోర్టుకు తెలిపారు. కనిపించకుండా పోయిన ఆ పేజీలను రికార్డుల్లో చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని ఏజీ కోరారు.
రాఫెల్ డీల్లో మోడీ సర్కార్ తీరును తప్పు పడుతూ దాఖలైన పిటిషన్లపై గురువారం చీఫ్జస్టిస్ రంజన్గొగోరు నేతృత్వంలోని ముగ్గురుసభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున ఏజీ తన వాదన వినిపించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్భూషణ్ వాదించారు. రక్షణశాఖ నుంచి లీకైన పత్రాలను వాదన కోసం తీసుకోవడానికి ముందు కేంద్రం నుంచి వచ్చిన ప్రాథమిక అభ్యంతరంపై నిర్ణయించాల్సి ఉన్నదని ధర్మాసనం తెలిపింది. దీనిపై ఆదేశాలను సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.
దేశ భద్రతకు సంబంధించిన పత్రాలను ఎవరూ ప్రచురించకూడదని ఏజీ వాదించారు. దేశ భద్రత అంశం అన్నిటినీ పక్కన పెడుతుందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 123, సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టంలోని నిబంధనలు తన వాదనను బలపరు స్తాయని ఏజీ తెలిపారు. కాగా, ఏజీ వాదనను పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్భూషణ్ తోసిపు చ్చారు. రాఫెల్ ఒప్పంద పత్రాలు ఇప్పటికే ప్రచురితమై పౌరులకు అందు బాటులో ఉన్నాయని ప్రశాంత్భూషణ్ తెలిపారు. నిఘా ఏజెన్సీల సమాచారం మినహా ఏ అంశం లోనూ కేంద్రానికి ప్రత్యేక హక్కులు లేవని, ఆర్టీఐ చట్టం లోని నిబంధనల ప్రకారం ప్రజాభీష్టం మేరకు ఏ సమాచారా న్నైనా బహిర్గతం చేయవచ్చునని ప్రశాంత్భూషణ్ తెలిపారు.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదికలో రాఫెల్ జెట్ల ధరలు మినహా ఏ డీల్కు సంబంధించి కూడా ఇప్పటివరకూ దాచిపెట్టలేదని ప్రశాంత్భూషణ్ కోర్టుకు తెలిపారు. కాగ్ నివేదికలో యూపీఏ హయాంలో నిర్ణయించిన రాఫెల్ జెట్ల ధరలను, మోడీ సర్కార్ ధరలతో పోల్చి రెండింటి మధ్య తేడాను శాతాల్లో మాత్రమే పేర్కొన్న విషయం గమనార్హం. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కేసుకు సంబంధించిన వాస్తవాలపై విచారణ జరపడానికి ముందు కేంద్రం అభ్యంతరంపై తాము నిర్ణయించాల్సి ఉన్నదని తెలిపింది. అయితే,రూ.58,000 కోట్ల రాఫెల్ డీల్లో ఫ్రాన్స్ నుంచి సార్వభౌమ హామీని చేర్చనందున దీనిని ప్రభుత్వాల మధ్య అంతర్గత ఒప్పందం(ఐజీఏ)గా భావించలేమని ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తెచ్చారు. అంతేగాక వెల్లడించిన వాస్తవాల విషయంలో తమకు సమాచారమిచ్చినవారి వివరాలు రహస్యంగా ఉంచేందుకు ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తుందని ప్రశాంత్భూషన్ తెలిపారు. ద హిందూలో రాఫెల్ డీల్కు సంబంధించిన రక్షణశాఖ అధికారిక పత్రాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. విచారణను దృష్టిలో ఉంచుకొని బుధవారమే సుప్రీంకోర్టుకు కేంద్రం ఓ అఫిడవిట్ సమర్పించింది. పిటిషనర్ల తీరు సున్నితమైన జాతీయ భద్రతను ప్రమాదంలో పడేసేలా ఉన్నదని కేంద్రం అందులో పేర్కొన్నది. అధికారిక పత్రాల ఫోటోకాపీలను దొంగిలించి, లీక్ చేశారని తెలిపింది.