Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ పార్టీలకు మహిళ సంఘాల డిమాండ్
- మా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి : మరియం ధావలే
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మహిళల సమస్యలు అందుకు సంబంధించిన పరిష్కారాలను మ్యానిఫెస్టోలో పెట్టాలని మహిళ సంఘాలు డిమాండ్ చేశాయి. గత ఐదేండ్ల్లలో ఆర్ఎస్ఎస్-బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కార్ హింస, భయం, ఆకలి, నిరుద్యోగం సృష్టించిందని విమర్శించాయి. గురువారం నాడిక్కడ స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో మహిళ సంఘాల నేతలు ''మహిళ చార్ట్ర్ డిమాండ్స్'' విడుదల చేశారు. ఐద్వా, ఏఐడీిఎంఎఎం, ఏఐఎంఎస్ఎస్, ఏఐపీడబ్ల్యూఏ, ఎండబ్ల్యూఎఫ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, పీిఎంఎస్, గిల్డ్ ఆఫ్ సర్వీస్ తదితర సంఘాల నేతలు సంయుక్తంగా విడుదల చేశాయి. ఈ సందర్భంగా ఐద్యా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే మాట్లాడుతూ దేశంలో 45 ఏండ్లలో ఎన్నడూ లేనంత తక్కువ ఉపాధి కల్పన జరిగిందన్నారు. మహిళల ఉపాధి మరింత దిగజారిందని వెల్లడించారు. అసంఘటిత రంగం పెరిగిందని, అందులో మహిళలకు హక్కులు లేకుండా పోయిందని అన్నారు. బయోమెట్రిక్ విధానం పూర్తి విఫలమైందన్నారు. దీనిపై ఐద్వా, ఇతర మహిళ సంఘాలు ఆందోళనలు చేశామని తెలిపారు. ఉపాధి హామీ నిధులు విడుదల చేయలేదని, ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో వేతనాలు పెండింగ్లోనే ఉన్నాయని చెప్పారు. ఉజ్వల గ్యాస్ సిలిండర్ నిలిపివేసేందుకు కుట్ర పన్నుతుందని చెప్పారు. సబ్సీడీలను ఎత్తివేయసేందుకు ప్రయత్నం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగానే గ్యాస్ ధరలు పెంచారని విమర్శించారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడో వంతు సీట్లు కేటాయించాలని కోరారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హామీ ఇవ్వలని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ అందరికీ కల్పించాలని, ప్రతి కుటుంబానికి 35 కేజీల ఆహార పదార్ధాలు ఇవ్వాలని తెలిపారు. పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించాలని, ప్రతి వ్యక్తికి ఐదు లీటర్ల కిరోసిన్ ఇవ్వాలని, సబ్సీడి ధరలకు గ్యాస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధరల నియంత్రణ చేయాలని, ఐసీడీఎస్, ఎండీిఎంఎస్లను బలోపేతం చేయాలని అన్నారు. ఎంఎన్ఆర్ఈజిఎలో మహిళలకు కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. సామాజిక భద్రత కల్పించాలన్నారు. 55 ఏండ్ల్లు దాటిని మహిళలకు రెండు వేలు పెన్షన్ ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. జస్టిస్ వర్మ కమిటీ రిపోర్టు అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. చిన్నారులపై అత్యాచారాలను నియంత్రించాలని అన్నారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యు నేత రుస్తా మాట్లాడుతూ దేశంలో మతోన్మాద విద్వంసం సృష్టిస్తున్నారని, గోరక్షక్ పేరుతో హత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మహిళలపై దాడులు పెరుగుతుంటే మోడీ సర్కార్ నిద్రపోయిందని దుయ్యబట్టారు. విలేకరుల సమావేశంలో ఏఐఎంఎస్ఎస్ నేత రితూ, పీిఎంఎస్ చాయా, ఐద్వా నేతలు మొమునా మొల్లా, ఆశాశర్మ తదితరులు పాల్గొన్నారు.