Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోవింద్ పన్సారే హత్య కేసులో సిట్ తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం
ముంబయి : హేతువాది గోవింద్ పన్సారే హత్య కేసులో విచారణ నిమిత్తం నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) తీరు పట్ల బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ అంటే 'నవ్వులాటగా ఉందా..?' అంటూ సిట్ అధికారులపై మండిపడింది. విచారణలో జరుగుతున్న పురోగతిపై కోర్టుకు సిట్ సమర్పించిన పత్రాలు పరిశీలించిన మీదట కోర్టు పై విధంగా స్పందించింది. కేసు విచారణలో జాప్యానికి గల కారణాలు వివరిస్తూ ఈ నెల 28న కోర్టుకు హాజరుకావాలని మహారాష్ట్ర హౌం డిపార్ట్మెంట్ అడిషినల్ చీఫ్ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేసింది. 'ఇప్పటికైనా బాధ్యతతో పనిచేయండి. లేకుంటే తర్వాత ఎదుర్కోబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి' అని సిట్, సీఐడీలను మందలించింది. 'నేరాలన్నీ కోర్టు జోక్యంతోనే పూర్తైతే దేశంలో న్యాయవ్యవస్థ ఒక్కటే రక్షించేది అవుతుందనే విషయం ప్రజల్లోకి వెళ్తుంది. ఇది బాధాకరం. దీని ద్వారా సమాజానికి మనం ఏం చెప్పదలిచాం' అని కోర్టు మందలించింది. నిందితులను పట్టుకోవడంలో సిట్ ఇంత తాత్సారం చేస్తుండటం విడ్డూరంగా ఉన్నదని తెలిపింది. ప్రగతిశీల రాష్ట్రంగా పేరున్న మహారాష్ట్రలో హేతువాదులు మరణించడం బాధాకరమనీ, ఇలాంటి వాటిని సహించేది లేదని పేర్కొంది. 'ప్రజలను రక్షించకుంటే ఎన్నికలలో పోటీ చేయకండి' అని రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది.