Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థుల విస్తృత ప్రచారం
విజయవాడ: ప్రజాసమస్యలపై నిత్యం పోరాటాలు చేసే కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండటం ఎంతో అవసరమని సీపీఐ(ఎం) శాసనసభ, లోక్సభ అభ్యర్థులు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుచోట్ల జనసేన, సీపీఐ, బీఎస్పీలు బలపర్చిన సీపీఐ(ఎం) అభ్యర్థులు గురువారం ప్రచారం నిర్వహించారు. కర్నూలులోని చల్లవారి వీధి, తిలక్ నగర్, శివయ్య నగర్, బాబా బృందావన్ నగర్, రాజీవ నగర్లలో కర్నూలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు కె.ప్రభాకర్రెడ్డి, టి.షడ్రక్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీల్లో అభ్యర్థులకు ప్రజలు పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లో ధన, మత రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజా సమ స్యలు పరిష్కరించి, అభివృద్ధిని కాంక్షించే సీపీఐ(ఎం)కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బి.బలరాం ఆకివీడులో ప్రచారం నిర్వహించారు. తొలుత ఆకివీడు పాతబస్టాండ్ సెంటర్లోని మహాత్మాగాంధీ, బిఆర్.అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనగర్ కాలనీలో ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను గాలికొదిలేసి తమ అవసరాల కోసం ముందుకు సాగుతున్న పార్టీలను పక్కనపెట్టాలని, జనసేన, లెఫ్ట్, బీఎస్పీ కూటమిని గెలిపించాలని కోరారు. కొల్లేరు సమస్యను తీరుస్తామని చెప్పినా ప్రభుత్వం దానిని పక్కన పెట్టిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే శివరామరాజుకు పది సంవత్సరాలు పట్టంకట్టినా కాలుష్యం, రోగాలు, బాధలను ఇక్కడి ప్రజలకు బహుమతిగా ఇచ్చారన్నారు. నరసాపురం లోక్సభ స్థానం నుండి జనసేన నేత నాగబాబు, ఉండి అసెంబ్లీ స్థానం నుండి తాను పోటీ చేస్తున్నామని, తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి కోలక అవినాష్ను గెలిపించాలని కోరుతూ గరుగుబిల్లి, కురుపాం, గుమ్మలక్ష్మిపురంలో జనసేన, సీపీఐ, సీపీఐ(ఎం) నాయ కులు, కార్యకర్తలు ప్రచారం చేశారు. గరుగుబిల్లి మండల కేంద్రంలో సీపీఐ(ఎం) కార్యా లయాన్ని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి ప్రారంభించారు. గుమ్మలక్ష్మీపురంలో జనసేన నాయకులు కె.మల్లేసు ప్రచారం చేశారు. కురుపాం పురవీధుల్లో సిపిఎం నాయకులు ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. తనను అసెంబ్లీకి పంపితే ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తాగు, సాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం సమస్యలపై నికరంగా పోరాడుతానన్నారు. రావాడ జంక్షన్ నుంచి ప్యాలెస్ రోడ్డు, ఆస్పత్రి రోడ్డు, మెయిన్ రోడ్డు, జిసిసి కాలనీల్లో ప్రచారం నిర్వహించారు.
23న సాంస్కృతిక దళాలకు శిక్షణ
- మంతెన సీతారామ్
విజయవాడ: జనసేన, సీపీఐ, బీఎస్పీ బలపర్చిన రంపచోడవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సున్నం రాజయ్య విజయం కోసం సాంస్కృతిక దళాలకు శిక్షణ ఇవ్వనున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారామ్ చెప్పారు. శిక్షణా కార్యక్రమం ఈ నెల 23న రంపచోడవరంలో ప్రారంభమవుతుందని తెలిపారు. రంపచోడవరంలోని నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం కోసం సాంస్కృతిక దళాలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎన్నికల సందర్భంగా ఆరు పాటలతో కూడిన ఎన్నికల క్యాసెట్ను ఈ నెల 22న విజయవాడలో పార్టీ నాయకత్వం విడుదల చేస్తుందన్నారు. అన్ని జిల్లాల్లో కొత్తపాటలకు అనుగుణంగా నృత్యదళాలు, పాటల దళాలు శిక్షణ పొందుతాయన్నారు. రెండు రోజుల్లో సీపీఐ(ఎం) పోటీ చేస్తున్న రెండు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శిక్షణ పొందిన దళాలు ప్రచారం నిర్వహిస్తాయని చెప్పారు. పాటల ద్వారా టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అవకాశవాద విధానాలపై ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చేస్తామని తెలిపారు.