Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్లో మహాకూటమి మధ్య సీట్ల సర్దుబాటు
పాట్నా : ఎన్డీయేకు వ్యతిరేకంగా బీహార్లో ఏర్పాటైన మహాకూటమి మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీతో తుది చర్చలు జరిపిన రాష్ట్రీయ జనతాదళ్( ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుక్రవారం ఆర్జేడీ నేత మనోజ్ ఝా...సీట్ల సర్దుబాటు విషయంపై అధికారికంగా ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ 20స్థానాల్లో పోటీ చేస్తుందనీ, కాంగ్రెస్ 9స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపనుందనీ తెలిపారు. ఈ మహాకూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్తోపాటు పలు పార్టీలు కొనసాగనున్నాయి. ఇందులో భాగస్వాములుగా ఉన్న ఆర్ఎల్ఎస్పీ-5, హెచ్ఏఎమ్-3, వీఐపీ-3 స్థానాల్లో పోటీ చేస్తాయని ఆయన ప్రకటించారు. ఆర్జేడీ కోటాలో సీపీఐ(ఎంఎల్)కి ఒకస్థానంలో పోటీ చేసే అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు.
ఇక లోక్తాంత్రిక్ జనతాదళ్ పార్టీ నాయకుడు శరద్ యాదవ్...ఆర్జేడీ ఎన్నికల గుర్తుతో పోటీ చేస్తారనీ, ఎన్నికల అనంతరం ఆయన పార్టీ తమ పార్టీలో విలీనం అవుతుందనీ మనోజ్ ఝా ప్రకటించారు. దేశ రాజ్యాంగాన్ని కాపాడేం దుకు తమ మహాకూటమి పనిచేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, మీడియా ముందుకు తేజస్వీ యాదవ్ రాకపోవడంపై మనోజ్ను మీడియా ప్రశ్నించింది. మహాకూటమిలో ఎటువంటి విభేదాలు లేకపోతే ఆయనెందుకు రాలేదనీ విలేకర్లు ప్రశ్నించారు. దీంతో ఆయన స్పందిస్తూ...''మా పార్టీలో నాకు విలువ లేదా? మీరు నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదా? చివరి నిమిషంలో పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం, చోటుచేసుకున్న మార్పులు ఇవి'' అని అన్నారు. కాగా బీహార్లోని మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయం చాలా ఆలస్యమైందనీ, దీంతో ఆ కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయనీ ఇటీవల ప్రచారం జరిగింది.