Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులతో రోడ్డుపై బైఠాయింపు
- కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరిక
తిరుపతి: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ మోహన్బాబు ఆధ్వర్యంలో విద్యార్థులు కదం తొక్కారు. రంగంపేటలోని విద్యానికేతన్ రోడ్డుపై శుక్రవారం ఉదయం గంటసేపు విద్యార్థులతో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఆందోళనకు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్లు మద్దతు ప్రకటించారు. దీంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సర్దిచెప్పినా వినలేదు. ఈ సందర్భంగా మోహన్బాబు మాట్లాడుతూ ప్రభుత్వం దాదాపు తన విద్యాసంస్థకి 20 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సి ఉందన్నారు. అనేకమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉత్తరాలు రాశానని తెలిపారు. విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్కు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఈనెల నాలుగో తేదీ ప్రెస్మీట్ నిర్వహించి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడం వల్లనే, ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. తిరుపతి అర్బన్ ఎఎస్పి అనిల్కుమార్ మోహన్బాబుతో చర్చలు జరిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం నుంచి రావాలంటే నిరసన తెలియజేసే సమయం ఇది కాదని, ఎన్నికల కోడ్ అమల్లోఉందని తెలిపారు. చంద్రబాబు స్పందించకుంటే బిడ్డలకు అన్నం పెట్టే పరిస్థితి కూడా ఉండదని తెలిపారు. దాదాపు గంటపాటు ఆందోళన నిర్వహించి, ఫీజు రీయింబర్స్మెంట్పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆందోళన విరమించారు.
మోహన్బాబు ఆరోపణల్లో వాస్తవం లేదు : చర్చకు సిద్ధమన్న కుటుంబరావు
ఫీజు రీ ఎంబర్స్మెంట్ గురించి మోహన్బాబు చేసిన వ్యాఖ్యలపై చర్చకు తాను సిద్ధమనిరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు సవాల్ విసిరారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి మాటలో విని తిరుపతిలో విద్యార్దులతో కలిసి ధర్నాకు దిగడం మంచిదికాదన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్హాల్ మీడియా పాయింట్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రూ.2,700కోట్లు ఫీజు రీ ఎంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. పాత బకాయిలు తీర్చి రూ.14,510 కోట్లు ఫీజు రీ ఎంబర్స్మెంట్కు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. శ్రీవిద్యానికేతన్ కళాశాలల్లోని విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్మెంట్ రావడం లేదంటూ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని అన్నారు. ఫార్మసీ, డిగ్రీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలల విద్యార్దులకు ఫీజు రీ ఎంబర్స్మెంట్ ధరఖాస్తు చేశారా అని ఆయన ప్రశ్నించారు. 2014-15 నుంచి ఐదేళ్లలో శ్రీవిద్యానికేతన్ కళాశాలలకు రూ. 95కోట్లు మంజూరుకాగా రూ.88.57 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. 2014-17కు సంబందించి కేవలం రూ.3.40లక్షలు, 2017-18కు రూ.1.86 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నాయన్నారు. 2018-19కి మూడవ క్వార్టర్ వరకు రూ.4.53కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తికానందున ఈ ఏడాది చివరిలోగా పెండింగ్ బకాయిలు ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందన్నారు.