Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మాయావతి
లక్నో: బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఉత్తరప్రదేశ్లో ఒక్క హింసాత్మక ఘటన చోటు చేసుకోలేదని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మండిపడ్డారు. దీనిపై ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ.. ''గత రెండేండ్లలో మూక దాడులు జరగలేదన్నది ఓ ప్రహసనం. బీజేపీ నాయకులు వారిపై ఉన్న కేసుల్ని ఎత్తివేసుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు. దేశానికే మచ్చ తెచ్చిన మూకదాడుల సంగతేంటి..? ఈ విషయంలో చివరకు కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది'' అంటూ పేర్కొన్నారు. యూపీలో అధికారం చేపట్టి రెండేండ్లైన సందర్భంగా ఆదిత్యనాథ్ రెండు రోజుల క్రితం బీజేపీ సర్కారు చేసిన పనులను ప్రజలకు వివరించారు. కాగా సీఎం వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. బీజేపీ పాలన రాష్ట్ర ప్రజలకు శాపంలా మారిందని విమర్శించారు. యోగీ పాలనలో ఎన్కౌంటర్లు పెరిగాయనీ.. దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయనీ ఆరోపించారు.