Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మ్యానిఫెస్టో, ఎన్నికల ప్రచార సీడీ విడుదల సందర్భంగా మధు, శ్రీనివాసరావు
- త్రిముఖ పోటీకి మారిన రాజకీయం
- టీడీపీ, వైసీపీ మ్యాచ్ఫిక్సింగ్
- అందుకే అభ్యర్థులను మార్చుకుంటున్నారు
అమరావతి : రాష్ట్రంలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల రాజకీయ గుత్తాధిప త్యాన్ని బద్దలు కొట్టాలని, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి బలపడడానికి తగ్గ వాతావరణం రాష్ట్రంలో ఏర్పడిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీని వాసరావు అన్నారు. శుక్రవారం మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆ పార్టీ మ్యానిఫెస్టో, ఎన్నికల ప్రచార పాటల సిడిసి విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టిడిపి, వైసిపికి భిన్నమైన ప్రత్యా మ్నాయ ప్రణాళికను ప్రజల ముందుకు తీసుకొస్తున్నా మని తెలిపారు. రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలను వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నా యాన్ని తీసుకొస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో టిడిపి, వైసిపి విధానాలు తోడుదొంగల మాదిరి ఉన్నాయన్నారు. రెండు పార్టీలూ కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపాయని, జిఎస్టి, నోట్లరద్దుకు అంగీకరిం చాయని వివరించారు. రాష్ట్రపతి,
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ బహిరంగ మద్దతు ప్రకటించారని పేర్కొన్నారు. ముస్లిములు, దళితులపై దాడులు జరుగుతుంటే ఏనాడూ నోరెత్తలేదని, వారిని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉందని, కనీస మద్దతు ధరలు అందడం లేదని, దాని గురించి రెండు పార్టీలకూ పట్టడం లేదని అన్నారు. రుణమాఫీ చేయడంలో వైఫల్యం చెందారని, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడం లేదని అన్నారు. దీనిపై స్పష్టమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. గిరిజనులపై దాడులు పెరిగాయని, వాటిని వైసిపి పట్టించుకోలేదని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని టిడిపి, వైసిపి, బిజెపి నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. దోపిడీలో టిడిపికి సహకరించేందుకే వైసిపి అసెంబ్లీకి వెళ్లకుండా ఇష్టం వచ్చిన చట్టాలు చేసుకునేందుకు సహకరించిందని చెప్పారు. కొన్ని చోట్ల టిడిపి, వైసిపి నాయకులు 60 : 40 పద్ధతిలో పంచుకుతిన్నారని విమర్శించారు. ఇద్దరి మధ్య ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నారు. అందులో భాగంగానే అభ్యర్థులను నామినేషన్ల సమయంలోనూ మార్చుకుంటున్నారని పేర్కొన్నారు. దోపిడీకి ఎవరికీ ఎవరూ అడ్డురాకూడదనే సిద్ధాంతాన్ని రెండు పార్టీలూ అనుసరిస్తున్నాయనడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు దోచుకుతింటుంటే దాన్ని ప్రశ్నించలేదని పేర్కొన్నారు. జనసేన, సీపీఐ(ఎం) , సిపిఐ, బిఎస్పితో రాష్ట్రంలో ప్రత్యామ్నాయశక్తి ముందుకొచ్చిందని, యువతీ, యువకులు ముందుకొస్తున్నారని బలమైన శక్తిగా ఎదుగుతోందని చెప్పారు. వాతావరణం ద్విముఖ పోటీ నుండి త్రిముఖ పోటీకి మారిందని తెలిపారు. దీంతో తట్టుకోలేని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి తప్పుడు ఆరోపణలను నమ్మొద్దని అన్నారు. హోదాపై తొలుత ఆందోళనలు జరిపింది వామపక్షాలేనని పేర్కొన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్ర అసెంబ్లీలో వామపక్షాలు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోందని, దీన్ని పూరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.