Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2008 నుంచి 2011 వరకూ కర్నాటక సీఎంగా యడ్యూరప్ప నుంచి రూ.1800 కోట్ల ముడుపులు
- 'ద యెడ్డీ డైరీస్' పేరుతో కారవాన్ కథనం
- బీజేపీ నేతల్లో ఆందోళన
బెంగళూర్ : ద యెడ్డీ డైరీస్ పేరుతో కారవాన్ మాస పత్రిక ప్రచురించిన కథనం దుమారం రేపుతోంది. కర్నాటక ముఖ్యమంత్రిగా (2008 నుంచి 2011 వరకు) ఉన్నప్పుడు బిఎస్ యడ్యూరప్ప బీజేపీ అగ్రనేతలకు రూ.1800 కోట్లమేర ముడుపులు ముట్టజెప్పినట్టు కారవాన్ కథనం వెల్లడించింది. యడ్యూరప్ప తన స్వదస్తూరీతో, సంతకాలతో రాసిన డైరీలో కేంద్ర మంత్రులు అరుణ్జైట్లీకి రూ.150 కోట్లు, నితిన్గడ్కరీకి రూ.150 కోట్లు, రాజ్నాథ్సింగ్కు రూ.100 కోట్లు, బీజేపీ సీనియర్ నేతలు ఎల్కె అద్వానీకి రూ.50 కోట్లు, మురళీ మనోహర్జోషీకి రూ.50 కోట్లు ముట్టజెప్పినట్టు పేర్కొన్నారని ఆ కథనం తెలిపింది. దీంతో కాషాయదళంలో ఆందోళన నెలకొంది. ఈ డైరీలను 2017 ఆగస్టులో ఆదాయం పన్ను (ఐటీ)శాఖ యడ్యూరప్ప నుంచి స్వాధీనం చేసుకున్నట్టు కారవాన్ తెలిపింది. దీనిపై ఐటీశాఖ సీనియర్ అధికారి ఒకరు ఓ నోట్ను ఆర్థికమంత్రి అరుణ్జైట్లీకి పంపారని తెలిపింది. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సూచించాల్సిందిగా అధికారి కోరగా, అటునుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలిపింది. కర్నాటకలోనూ, ఢిల్లీలోనూ ఉన్న బీజేపీ నేతలను కాపాడేందుకే ఐటీశాఖ దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి దర్యాప్తునూ చేపట్టలేదని తమకు ఆ అధికారి తెలిపారని కారవాన్ పేర్కొన్నది.
బీజేపీ సీనియర్ నేతలకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు యడ్యూరప్ప వందలకోట్లు లంచాలిచ్చినట్టు మీడియాలో వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్సూర్జేవాలా డిమాండ్ చేశారు. 2017 నుంచి ఐటీశాఖ వద్ద ఉన్న డైరీ ఆధారంగానే మీడియా సంస్థ కథనం ఉన్నదని సూర్జేవాలా అన్నారు. గత ఐదేండ్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న నేతల అవినీతిపై ప్రాథమిక ఆధారాలున్నందున లోక్పాల్తో దర్యాప్తునకు ఈ కేసు అర్హమైనదిగా ఆయన తెలిపారు. చోర్ చౌకీదార్ దీనికి సమాధానం చెప్పాలంటూ ప్రధాని మోడీనుద్దేశిస్తూ సూర్జేవాలా ఎద్దేవా చేశారు.
కాగా, బీజేపీ నేతలు ఈ కథనాన్ని ఖండిస్తున్నారు. నిరాశా,నిస్ఫృహల్లో ఉన్న కాంగ్రెస్ అబద్ధపు ప్రచారానికి పూనుకున్నదని కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ప్రసాద్ విమర్శించారు. యడ్యూరప్పపై ఆరోపణలకు ఆధారాలు లేవని ఆయన అన్నారు. త్వరలో జరిగే ఎన్నికల కోసమే కాంగ్రెస్ ఈ కట్టుకథ అల్లిందని యడ్యూరప్ప అన్నారు. తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని ఆయన అన్నారు. తనపై ఆరోపణలు చేసినవారిపై పరువు నష్టం దావా వేయడంపై సీనియర్ న్యాయవాదులతో సంప్రదిస్తున్నట్టు యడ్యూరప్ప తెలిపారు.