Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ గట్టున అధికారం..ధనబలం
- ఈ గట్టున నిజాయితీ, చిత్తశుద్ధి:పవన్
అమరావతి: 'అవతలి గట్టున టీడీపీ..వైసీపీ ఉన్నాయి. అధికారం, ధనబలం అటువైపే ఉన్నాయి. ఈ గట్టున జనసేన, వామపక్షాలు, బీఎస్పీ కూటమి ఉంది. సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే నిజాయితీ, చిత్తశుద్ధి ఇటువైపు ఉన్నాయి. ఏ గట్టునుంటారో మీరు తేల్చుకోండి' అని ప్రజల నుద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన కృష్ణా జిల్లాలోని నూజీవీడు, మైలవరం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. బహిరంగసభల్లో ప్రసంగించారు. రంగస్థలం సినిమాలో ప్రజాదరణ పొందిన 'ఆ గట్టునుంటావా... ఈ గట్టునుంటావా' పాటను ప్రస్తావిస్తూ ఏ గట్టనుంటారో తేల్చుకోండన్నప్పుడు సభకు హాజరైన ప్రజల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. జనసేన, వామపక్షాల జెండాలు చూపుతూ ప్రజలను పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదుకోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకే జనసేన పార్టీని స్థాపించానన్నారు. భూకబ్జాదారులు, లిక్కర్మాఫియాల పాలనపోవా లంటే జనసేన,సీపీఐ(ఎం), సీపీఐ, బీఎస్పీలు బలపరచిన సిహెచ్ బాబూరావును అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని సెంట్రల్ నియోజక వర్గంలో పిలుపునిచ్చారు.