Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎటూతేలని 'సంఝౌతా ఎక్స్ప్రెస్' బాంబుపేలుడు విచారణ
- 12 ఏండ్లయినా దోషుల్ని పట్టుకోలేకపోయిన 'ఎన్ఐఏ'
- ఎన్ఐఏ విచారణపై ఎన్నో అనుమానాలు
- నేరస్థులు తప్పించుకున్నారా...తప్పించారా?
న్యూఢిల్లీ : 2007నాటి 'సంఝౌతా ఎక్స్ప్రెస్' (న్యూఢిల్లీ-లాహోర్ మధ్య నడిచే రైలు) బాంబు పేలుడు ఘటనలో 68మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 2006-2008 మధ్య ముస్లింలను లక్ష్యంగా చేసుకొని వివిధ రాష్ట్రాల్లో అనేక బాంబు పేలుళ్లు జరిగాయి. మాలేగావ్, అజ్మీర్ దర్గా, మక్కామసీద్...కేసుల్లో ఆయా రాష్ట్రాల 'సిట్' విచారణ, ఆర్ఎస్ఎస్..ఇతర హిందూత్వ శక్తులను నిందితులుగా పేర్కొంది. ఎప్పుడైతే ఈ కేసులు జాతీయ దర్యాప్తు బృందా(ఎన్ఐఏ)లకు అప్పజెప్పారో...అక్కడ్నుంచీ కేసులన్నీ నీరుగారిపోయాయి. ఏ ఒక్కకేసులోనూ నేరస్థులకు శిక్ష పడలేదు. సంఝౌతా ఎక్స్ప్రెస్ కేసు కూడా అదే విధంగా ముగిసింది.
2006-2008 మధ్య దేశవ్యాప్తంగా అనేక బాంబు దాడులు జరిగాయి. మాలేగావ్, అజ్మీరా షరీఫ్, మక్కా మసీద్, సంఝౌతా, మాలేగావ్-2...మొదలైనవన్నీ 'ముస్లిం'లను లక్ష్యంగా చేసుకొని జరిగినవే. పాకిస్తాన్ నుంచి 'ఇస్లామిక్ తీవ్రవాదు'లు ఈ పేలుళ్లకు పాల్పడ్డాయని మొదట కేసుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగింది. ఆయా రాష్ట్రాల్లో 'సిట్' విచారణలు ముందుకు కదులుతున్నకొద్దీ...ఈ పేలుళ్ల వెనుక ఆర్ఎస్ఎస్, ఇతర హిందూత్వ శక్తుల నాయకులున్నారని బయటపడింది. సంఝౌతా ఎక్స్ప్రెస్ పేలుడు కేసు విచారణను హర్యానా ప్రభుత్వం 'సిట్'కు అప్పజెప్పినప్పుడే ఆర్ఎస్ఎస్, హిందూత్వ శక్తుల ప్రమేయం తొలిసారిగా బయటపడింది.
ముందుగా చెప్పుకోవాల్సింది 2006లో జరిగిన 'మాలేగావ్' బాంబు పేలుళ్లు. మహారాష్ట్రలోని మాలేగావ్ వద్ద ఉన్న మసీదు బయట పేలుళ్లు జరిగాయి. 38మంది అమాయకులు చనిపోయారు. సంఝౌతా ఎక్స్ప్రెస్ పేలుడు ఘటనలో 68మంది చనిపోయారు. మరికొద్ది నెలల్లోనే హైదరాబాద్లోని మక్కామసీదులో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఇక్కడ 9మంది చనిపోయారు. అజ్మీర్ దర్గా పేలుడులో ముగ్గురు చనిపోయారు. 2008లో రెండోసారి మాలేగావ్లో పేలుళ్లు జరిగాయి. గుజరాత్లోని మోదాసాలో పేలుడు ఘటన జరిగింది. ఈ వరుస బాంబుపేలుడు ఘటనలన్నీ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నవే. వరుస పేలుళ్లలో మొత్తం 127 మంది అమాయకులు ప్రాణాలుకోల్పోయారు. పాకిస్తాన్లోని 'సిమి' ఉగ్రవాదులే ఈ పేలుళ్లు జరిపారన్న ప్రచారం మీడియాలో పెద్ద ఎత్తున జరగటంతో ఆర్ఎస్ఎస్, హిందూత్వ శక్తుల ప్రమేయం బయటకురాలేదు.
అయితే 'వికాస్ నరైన్ రాయ్' అనే అధికారి నేతృత్వంలో హర్యానా ప్రభుత్వం వేసిన సిట్ దర్యాప్తులో అసలు నిజాలు బయటపడ్డాయి. దేశంలో వరుస బాంబుపేలుళ్ల వెనుక ఆర్ఎస్ఎస్, హిందూత్వ శక్తుల ప్రమేయం ఉందనడానికి ఆధారాలు లభించాయి. సూట్కేసులో బాంబు అమర్చిన విధానం, వాడిన పరికరాలు, మరికొన్ని విషయాల్ని పరిశీలిం చాక...సిట్ అధికారుల అనుమానం ఆర్ఎస్ఎస్ సీనియర్ సభ్యుడు(ఇండోర్) సునీల్ జోషిపైకి వెళ్లింది. సునీల్ జోషిని 'సిట్' పట్టుకుందామని ఇండోర్కు వెళ్లగా, అతడ్ని ఎవరో హత్యచేశారు. దీంతో 'సిట్' అనుమానాలు మరింత బలపడ్డాయి. సునీల్ జోషిని గనుక తాము విచారణచేస్తే అసలు నిజాలు బయటపడతాయనే అతడ్ని హత్యచేశారని సిట్ చీఫ్ వికాస్ నరైన్ రారు అభిప్రాయపడ్డారు.
హేమంత్ కర్కరే విచారణ టర్నింగ్ పాయింట్
వికాస్ నరైన్ రారు చెప్పినదాన్నిబట్టి, వరుస బాంబు పేలుళ్లలో 'పాకిస్థాన్ సిమి' హస్తం ఉందని మా దర్యాప్తులో ఎక్కడా చిన్న ఆధారం లభ్యం కాలేదు. మాలేగావ్ పేలుళ్లు విచారణ జరుపుతున్న 'హేమంత్ కర్కరే' (ఏటీఎస్) ఒక కీలక ఆధారాన్ని పట్టుకున్నారు. మాలేగావ్ పేలుళ్లకు వాడిన మోటార్వాహనం 'సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్'కు చెందినదని ఏటీఎస్ విచారణ తేల్చింది. అసీమానంద్, ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత అనే ముగ్గురు వ్యక్తులు పేలుళ్లకు కుట్రపన్నారని 'ఏటీఎస్' విచారణ గుర్తించింది. 2008 ముంబయి పేలుళ్ల ఘటన సమయం లో 'హేమంత కర్కరే' ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి కేసు విచారణ ముందుకు సాగకుండా చేసింది. మాలేగావ్, అజ్మీరా దర్గా, సంఝౌతా...వరుస పేలుళ్ల కేసులన్నీ 2010లో 'జాతీయ దర్యాప్తు బృందా'(ఎన్ఐఏ)కు అప్పజెప్పారు. అయితే ఏ ఒక్కకేసులోనూ నిందితులకు వ్యతి రేకంగా సరైన సాక్ష్యాధారాలను సేకరించడంలో ఎన్ఐఏ సక్సెస్ కాలేదు. సంఝౌతా ఎక్స్ప్రెస్ కేసు విచారణకు 12ఏండ్లు పట్టిందంటేనే, దీనివెనుక ఎంతసాగదీత ఉందో అర్థం చేసుకోవచ్చు. సరైన సాక్ష్యాధారాలు లేవని మార్చి 20న ప్రత్యేకకోర్టు సంఝౌతా ఎక్స్ప్రెస్ పేలుడు కేసులో నిందితులందర్నీ విడుదల చేసింది.
మాటమార్చిన అసీమానంద్
ఇంతకుముందు మక్కా మసీదు, అజ్మీర్ షరీఫ్ బాంబు పేలుళ్ల కేసుల నుంచి కూడా స్వామి అసీమానంద్ సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగానే విడుదలయ్యారు. హిందూత్వ శక్తుల ప్రమేయమున్న కేసులన్నింటిలో సరైన సాక్ష్యాధారాలు సేకరించడంలో ఎన్ఐఏ విఫలమైందంటూ కోర్టులు పలుమార్లు ఆరోపించడం ఇక్కడ గమనార్హం. డిసెంబరు 2010లో, జనవరి 2011లో బాంబుపేలుళ్ల వెనుక తన హస్తం ఉందని కోర్టుముందు అసీ మానంద్ స్వయంగా వాంగ్మూలం ఇచ్చారు. కొన్ని నెలల తర్వాత మాటమార్చి పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేయడంవల్ల అలా తాను వాంగ్మూలం ఇవ్వాల్సివచ్చిం దని చెప్పారు.