Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారణాసి నుంచి 111మంది అన్నదాతలు బరిలో..!
చెన్నై : బీజేపీ పాలనలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. పలురాష్ట్రాల రైతులు తమ నిరసన ప్రదర్శనలను దేశరాజధాని ముంగిట్లోకి తీసుకెళ్లారు. అలా డిమాండ్లు అమలుకాకపోవడంతో తమిళ రైతులు ఏకంగా మోడీపైనే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రైతుపట్ల మోడీ వైఖరికి ప్రతిఫలంగానే ఈ నిర్ణయం ముందుకొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాని బరిలోకి దిగనున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 111మంది తమిళనాడు రైతులు పోటీ చేయనున్నారు. తాము బీజేపీకి, ప్రధానికి వ్యతిరేకం కాదనీ, మోడీ అధికారం చేపట్టేముందు మా డిమాండ్లు పూర్తి చేస్తారని హామీనిచ్చారని రైతు సంఘం నేత అయ్యకన్ను తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కూడా చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికి మోడీనే ప్రధాని, అధికారంలో బీజేపీనే ఉన్నదని, అందుకే మోడీపై పోటీకి దిగేందుకు నిర్ణయించుకున్నట్టు వివరించారు. వారణాసికి పయనమయ్యేందుకు 300మంది రైతులకు ఇప్పటికే రైలు టికెట్లు బుక్ చేసినట్టు తెలిపారు. తమ డిమాండ్లను బీజేపీ మ్యానిఫెస్టోలో పొందుపర్చాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటిస్తే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని, లేదంటే కచ్చితంగా ప్రధానిపై పోటీ చేసి తీరుతామని తెలిపారు. తమకు పెద్దఎత్తున రైతుల మద్దతు ఉన్నదని దీమా వ్యక్తం చేశారు. అప్పుల ఉచ్చులో చిక్కుకుని ఆత్మహత్య చేసుకున్న తమ తోటి రైతుల పుర్రెలను తీసుకుని గతేడాది నవంబర్లో అయ్యకన్ను నేతృత్వంలో ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు దిగిన విషయం తెలిసిందే.