Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు నెలలుగా జీతాల్లేవు
- మాకే ఈ కష్టాలెందుకు?
- సీఎం, ఇతర అధికారులకు జీతం ఒక్కరోజైనా ఆగాయా... : కాపలాదారుల నిలదీత
- జార్ఖండ్లో బతుకుపోరాటం
జార్ఖండ్:తనకు తాను చౌకీదార్గా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రకటించుకున్నారు. దేశానికి కాపలాదారుడనని ప్రచారం ప్రారంభించారు. సహచర మంత్రులు కూడా ఆయన బాటలోనే తామూ చౌకీదార్లమేనంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు చేసుకున్నారు. కాగా, ప్రధాని చౌకీదార్ వ్యాఖ్యలపై దుమారమే చెలరేగింది. చౌకీదార్ చోర్ అంటూ ప్రతిపక్ష నేతల విమర్శల అస్త్రాలను ఎక్కుపెట్టారు. చౌకీదార్లను చులకన చేసి మాట్లాడుతున్నారంటూ.. ప్రతిపక్షాలపై అధికార బీజేపీ పక్షం ఎదురుదాడికి దిగింది. ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు బీజేపీ ప్రభుత్వం అధికారంలోవున్న జార్ఖండ్లో దాదాపు 10 వేల మంది చౌకీదార్లకు నాలుగు నెలలుగా జీతాల్లేవు. వారు రంగులేని హోలీ పండుగతో సరిపెట్టుకున్నారు. పైసల్లేక కాపలాదారుల కుటుంబాలు పస్తుల్లో బతుకీడుస్తున్నాయి.
ఎవరీ చౌకీదార్లు?
బ్రిటిష్ కాలంలో అంటే 1870లో విలేజ్ చౌకీదార్ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు వ్యవస్థలో వారు భాగంగావున్నారు. కాగా, జార్ఖండ్ ప్రభుత్వం వారిని ఒక ప్రత్యేక క్యాడర్గా రూపొందించింది. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలోని 10 గ్రామాలను ఒక చౌకీదార్ పర్యవేక్షించాల్సి వుంటుంది. ఇందుకుగాను వారికి రూ. 20 వేల వేతనం చెల్లించాలి. చౌకీదార్లుగా పనిచేస్తున్న వారు జార్ఖండ్లో ప్రస్తుతం దాదాపు పది వేల మంది వున్నారు. నాలుగు నెలలుగా జీతాల్లేక వారు అవస్థలు పడుతున్నారు.
దేశమంతా చౌకీదార్ ప్రచారం.. మాకు మాత్రం జీతాల్లేవు : క్రిష్ణదయాల్ సింగ్
మాకు జీతాలు చెల్లించాలంటూ జార్ఖండ్లోని బొకొరో జిల్లాలో చౌకీదార్లు ఇటీవల ఆందోళనకు దిగారు. నాలుగు నెలలుగా జీతాలు లేకపోతే మేం ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. మా కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆకలిగోస వినైనా వెంటనే జీతాలు చెల్లించాలని వారు డిమాండ్చేస్తున్నారు. దేశం యావత్తు మై బీ చౌకీదార్ క్యాంపెయిన్ జరుగుతున్నది. నిజమైన కాపలాదారులమైన తమకు మాత్రం జీతాల్లేవు అని క్రిష్ణదయాల్ సింగ్ వాపోయారు. 'ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తనకు తాను చౌకీదార్గా ప్రకటించున్నారు. ఆ తర్వాత మై బీ చౌకీదార్ ప్రచారాన్ని ప్రారంభించారు. నిర్లక్ష్యానికి గురవుతున్న మమ్మల్ని కనీసం ఈ విధంగానైనా గుర్తించినందుకు మేం ఆనందిస్తున్నాం. కానీ, జీతాలు కూడా చెల్లించకపోతే మేం ఎట్లా బతకాలి? నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను.. ముఖ్యమంత్రి రఘుబార్ దాస్, ముఖ్య కార్యదర్శి సుధీర్ త్రిపాఠి, ఇతర అధికారుల జీతాలు ఒక్క రోజైనా ఆలస్యమయ్యాయా? చెప్పండి.. మాకే ఈ ఇబ్బందులు ఎందుకు?' అని అని సింగ్ ప్రశ్నించారు.
పోలీసు వ్యవస్థకు చౌకీదార్లు వెన్నెముకలాంటివారు. సంఘవిద్రోహ శక్తులపై కన్నేసి ఉంచుతారు. వారికి సంంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేస్తారు. నేరాలను నియంత్రించడంలో పోలీసులకు సహకరిస్తారు. 'సంఘవిద్రోహ శక్తుల బెదిరింపులను ఎదుర్కొంటూ మేం మా విధులను నిర్వహిస్తున్నాం.. కొన్నిసార్లు ప్రమాదకర పరిస్థితులను సైతం ఎదుర్కోవాల్సి వుంటుంది. అలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న మా పట్ల జీతాలు కూడా చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు' అని మరో చౌకీదార్ వాపోయారు. కుటుంబం గడవడానికి అధిక వడ్డీకి రుణాలు తీసుకొస్తున్నామనీ, ఫలితం తాము అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని తెలిపారు.