Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీకి మద్దతిస్తున్న వైసీపీని ఓడించండి
- జనసేన-లెఫ్ట్-బీఎస్పీ అభ్యర్థులను గెలిపించండి:
- అరకు బహిరంగ సభలో బృందా కరత్ పిలుపు
విశాఖపట్నం: ఆదివాసీల హక్కులు కాలరాచి, వారి జీవితాలను నాశనం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలను గద్దెదించాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్ పిలుపునిచ్చారు. మోడీకి మద్దతు ఇస్తున్న వైసీపీని ఓడించాలని, ప్రజల ప్రయోజనాలను కాపాడే జనసేన-లెఫ్ట్-బీఎస్పీ కూటమిని గెలిపించాలని ఆమె గిరిజనులకు విజ్ఞప్తి చేశారు. అరకులోయ ఎన్టీఆర్ మైదానంలో శనివారం డి.గంగరాజు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఆదివాసీల హక్కులను రక్షించుకునేందుకు, వారి గళాన్ని చట్టసభల్లో వినిపించేందుకు అరకు ఎమ్మెల్యే స్థానంలో సీపీఐ(ఎం) అభ్యర్థి కిల్లో సురేంద్రను, పార్లమెంటు స్థానంలో జనసేన అభ్యర్థి వి.గంగులయ్యను గెలిపించాలని కోరారు.
ఏజెన్సీలో అక్రమ మైనింగ్, బాక్సైట్ తవ్వకాలకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వైసీపీ నేత జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
అటవీ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా వేసిన కేసుపై మోడీ ప్రభుత్వం గిరిజనుల తరపున నిలబడకపోవడంతో సుప్రీంకోర్టు దేశంలో 23 లక్షల కుటుంబాలు గిరిజన ప్రాంతం నుంచి ఖాళీ చేయాలని ప్రమాదకరమైన తీర్పు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'అంబానీ, అదానీ, కార్పొరేట్ల కోసమైతే మోడీ మాట్లాడేవారని, గిరిజనులకు సంబంధించినది కేసు కావడంతో ఆయన మాట్లాడలేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం గిరిజనుల తరపున వాదించలేదు సరికదా, 66వేల కుటుంబాలను ఖాళీ చేయిస్తామని కోర్టుకు తెలిపిందని చెప్పారు.
గిరిజన ప్రాంతంలో భూమి, గనులు, అటవీ సంపదపై పూర్తి హక్కు ఆదివాసీలకే ఉందని, కాని మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు వాటిని లేకుండా చేయాలని చూస్తున్నాయని తెలిపారు. ప్రతి ఏటా గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి 20వేల కోట్ల సబ్ప్లాన్ నిధులు ఖర్చు చేయకపోయినా పార్లమెంటులో తెలుగుదేశం, వైసీపీ ఎంపీలెవరూ నిలదీయ లేదని, సీపీఐ(ఎం) ఎంపీ జితేందర్ చౌదరి మాత్రమే మాట్లాడారని చెప్పారు. గిరిజన, రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్న మోడీకి జగన్, టీడీపీ మద్దతు ఇవ్వడం, ఈ ఐదేండ్లలో ముస్లిం, క్రిస్టియన్, గిరిజనులు, దళితులపై దాడులు చేసినా వారు ఖండించకపోవడం సిగ్గు చేటని అన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి రూపాయి చొప్పున రూ.35 కేజీల బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.