Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెట్టుకు కట్టేసి దళిత విద్యార్థిపై దాడి
- ఇంట్లోకి చొరబడి ముస్లిం కుటుంబంపై..
- పాకిస్థాన్ వెళ్లిపోవాలని బెదిరింపులు
- హర్యానాలోని గురుగ్రాంలో ఘటన
చండీగఢ్ : బీజేపీ పాలిత హర్యానాలో మరో మూకదాడి చోటుచేసుకుంది. గురుగ్రాంలోని ధామస్పూర్ గ్రామానికి చెందిన ముస్లిం కుటుంబ సభ్యులను వారి ఇంట్లోకి చొరబడి కొందరు దుండగులు దాడి చేశారు. అంతకు ముందు వారింటికి సమీపంలో క్రికెట్ ఆడుతున్న ఆ కుటుంబ సభ్యులను పాకిస్థాన్ వెళ్లిపోవాలని, అక్కడే క్రికెట్ ఆడుకోవాలని బెదిరించారు. ధామస్పూర్లో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయింది.
ఎలా జరిగింది?
ఉత్తరప్రదేశ్ నుంచి హర్యానాకు వలస వచ్చి గురుగ్రాంలో స్థిరపడిన సాజిద్, సమీనా దంపతులకు ఆరుగురు సంతానం. హౌళీ పండుగ రోజున సాజిద్ కుటుంబం, బంధువుల పిల్లలు సాజిద్ ఇంటికి సమీపంలోని గ్రౌండ్లో క్రికెట్ ఆడారు. వీరు క్రికెట్ ఆడుతుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వారి దగ్గరకు చేరి.. 'ఇక్కడేం చేస్తున్నారు. పాకిస్థాన్ వెళ్లిపోండి. అక్కడే క్రికెట్ ఆడుకోండి' అని బెదిరించారని సాజిద్ మేనల్లుడు దిల్షాద్ చెప్పాడు. ఇరువైపుల నుంచి వాగ్వాదం పెరిగింది. కాగా, ఈ వాగ్వాదాన్ని సద్దుమణిగించేందుకు జోక్యం చేసుకున్న సాజిద్ను వారు చెంపపై కొట్టారని తెలిపాడు. 'మీరు ఇక్కడే ఉండండ్రా' అంటూ బైక్పై వెళ్లిపోయారని వివరించాడు. కాగా, నిమిషాల వ్యవధిలోనే సుమారు ఆరుగురు వ్యక్తులు రాడ్లు, కర్రలు పట్టుకుని బైక్లపై, చాలామంది కాలినడకన తమ దగ్గరికి వస్తున్నట్టు గుర్తించానని దిల్షాద్ చెప్పాడు. ఇది గమనించిన వెంటనే వారు భయంతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. 'బయటకు రండి. లేదంటే చంపేస్తామ'ని ఇంటి బయట గుమిగూడిన 35-40 మంది కేకలు వేశారు. 'మేం బయటకు రాకపోవడంతో వారే ఇంట్లోకి చొరబడ్డార'ని దిల్షాద్ చెప్పాడు. 'బంధువుల కోసం వంట చేస్తుండగా.. వారు హఠాత్తుగా ఇంటిలోపలకు దూసుకొచ్చార'ని సాజిద్ భార్య సమీనా తెలిపారు. 'ఏం జరిగిందని నేను వారిని అడుగుతుండగానే.. ఇవాళ ఈ ముల్లాలను వదిలేది లేదని అంటూ ఇంటిపైకి చేరి బంధువులు, కుటుంబీకులపై తీవ్ర దాడికి దిగార'ని చెప్పారు. ఇంట్లోని పురుషులతోపాటు ఓ మహిళపైనా దాడి చేశారు. కిటీకీలు, కార్లను ధ్వంసం చేశారని, బంగారు నగలు, చైన్ లాంటి విలువైన వస్తువులు సహా రూ. 25వేల నగదును దోచు కెళ్లారని సమీనా తెలిపారు. రెండో అంతస్తుకు వెళ్లి దాక్కున్న మహిళలు, చిన్నారుల్లో ఒకరు దానిష్ట.. ఈ దాడిని వీడియో తీశారు.
పోలీసుల అలసత్వం!
దాడి జరుగుతుండగానే పోలీసు హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేస్తూనే ఉన్నారని బాధితులు తెలిపారు. అయినప్పటికీ వారు ఘటనాస్థలికి సుమారు 40 నిమిషాల తర్వాత చేరుకున్నారని అన్నారు. ఈ సమయంలో దాడికి దిగిన దుండగులు పరారయ్యారని చెప్పారు. కాగా, ఇప్పటి వరకు ఒక నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. క్రికెట్ ఆడుతున్న రెండు బృందాల మధ్య గొడవ జరిగిందని, ఇందులో మతపరమైన కోణమేదీ లేదని గురుగ్రాం పోలీసు ప్రతినిధి సుభాశ్ తెలిపారు.
వారంలో రెండో ఘటన
వారం రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఇది రెండో ఘటన. ఈ నెల 18న రాష్ట్రంలోని చర్ఖి దాద్రి జిల్లాలో ముస్లిం మతానికి చెందిన తండ్రీ కొడుకులపై ఒక మూక దాడికి పాల్పడింది. అనంతరం వారి గడ్డాన్ని తీసేయించింది. అంతేకాదు, ఆ గడ్డం కారణంగా వారిని చంపేస్తామని బెదిరించింది. బాధితులు యూపీకి చెందిన మొహమ్మద్ ఇద్రీస్, ఆయన కొడుకు మొహసిన్గా ధ్రువీకరించారు. పేపర్ కప్పులను తయారుచేసే మొహమ్మద్ ఇద్రీస్ వ్యాపారం నిమిత్తం కొడుకుతో కలిసి హర్యానాలోని సంజర్వాస్ గ్రామానికి బయల్దేరారు. రాష్ట్రంలోని చర్ఖి దాద్రి బస్టాప్లో నిలిచి ఉండగా ఐదుగురు దుండగులు వారిని సమీపించి పేర్లు అడిగారు. ముస్లింలని తేలగానే వారిపై దాడికి దిగారు.