Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది నెల్లైనా.. పరిహారం ఇవ్వలేదు
- ప్రధాని పార్లమెంట్ నియోజకవర్గంలో అన్నదాతల కష్టాలు
- డబ్బులడిగితే ముఖం చాటేస్తున్న అధికారులు
లక్నో : ప్రధాని మోడీ సభల కోసం రైతులు సాగు చేస్తున్న పంట పొలాలు అద్దెకు తీసుకోవడం.. ఇవ్వకుంటే వారిని బెదిరించి వాటిని ధ్వంసం చేయడం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. అయితే, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గతేడాది నిర్వహించిన ఓ సభకు రైతుల భూములు తీసుకున్న అధికారులు.. ఆ తర్వాత అటువైపు ముఖం చాటేశారు. నష్ట పరిహారం గురించి అన్నదాతలు కాళ్లరిగేలా తిరిగినా వారిని పట్టించుకోవడం లేదు.
వివరాల్లోకెళ్తే.. 2018 జూలై 14న వారణాసిలోని కంకరర్ గ్రామంలో మోడీ భారీ సభ నిర్వహించారు. దాదాపు రూ. 450 కోట్లతో 20 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సభ కోసం అధికారులు పదెకరాల పచ్చని పంట పొలాలను గిరిజా, ఖటారు లాల్, చమేలి దేవి అనే రైతుల నుంచి తీసుకున్నారు. బెండ, కొత్తిమీర, టమాటో, గుమ్మడి వంటి కూరగాయలు పండించే ఈ సన్నకారు రైతులు.. ప్రధాని సభ అనేసరికి తప్పనిసరి పరిస్థితులలో ఇచ్చేశారు. పంట చేతికొచ్చే దశలో ఉండగా ఆ భూములను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వాటికి నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఆ పంటల్ని పీకేశారు. మోడీ సభకు ఆ భూములను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాని రాకపోకల కోసం మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. సభ నిర్వహణలో భాగంగా ఆ భూములలో ఇసుక, పెద్ద పెద్ద కంకర రాళ్లను ఎక్కడ పడితే అక్కడ పాతారు. సభ ముగిసినా ఆ వ్యర్థాలను తొలగించలేదు. దీంతో, ఆ భూములను చదును చేసుకోవడం రైతులకు తలకు మించిన భారం అవుతోంది. ఈ తతంగం ముగిసి దాదాపు ఏడాది కావస్తున్నా రైతులకు మాత్రం నష్టపరిహారం అందని ద్రాక్షే అయ్యింది. కూరగాయలు తక్కువగా దొరికే మాసంలో అవి చేతికొచ్చినా వాటిని అధికారులు నాశనం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి సాగుచేసినా తమకు తిరిగి అప్పులే మిగిలాయని రైతులు వాపోతున్నారు.
దీనిపై బాధిత రైతులలో ఒకరైన గిరిజా మాట్లాడుతూ.. మోడీ తమకు మంచి చేస్తారని అనుకుంటే, ఆయన తమ పొలాలన్నింటినీ ధ్వంసం చేసి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది. పదిరోజులలో నష్ట పరిహారం అందిస్తామని చెప్పిన అధికారులు.. పదినెలలైనా తమ వైపు చూడలేదని తెలిపింది. మరో రైతు చమేలి దేవి స్పందిస్తూ.. ఈ భూములను తాము కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నామన్నారు. సాగు చేసినదాంట్లో నాలుగింట మూడో వంతు యజమానికే దక్కుతోందని.. కానీ, మోడీ సభ వల్ల తాము మరింత నష్టపోయామని చెప్పింది. ఏడాది క్రితం తాను సాగు చేసిన భూమంతా ఇప్పుడు రాళ్లూ రప్పలతో నిండిపోయిందని కన్నీటి పర్యంతమైంది. పంట సాగు చేయడానికి రూ. 15 వేలు ఖర్చు చేశామని.. అధికారులు నష్టపరిహారం చెల్లించకపోవడంతో తామింకా నష్టపోతున్నామని వెల్లడించింది. పంట అమ్మగా వచ్చిన నగదుతో తన ముగ్గురు కొడుకుల స్కూలు ఫీజులు కట్టాలనుకున్నానని, కానీ ప్రధాని సభ కారణంగా వారి చదువులు ముందుకు సాగే పరిస్థితి లేకుండా పోయిందంటూ మరో రైతు ఖటారు లాల్ కన్నీరుమున్నీరయ్యాడు.