Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 423 మందికి ఒక కోటికి పైగా ఆస్తులు : ఏడీఆర్
న్యూఢిల్లీ: దేశంలో లోక్సభ రెండోదశ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో 251 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఈ వివరాలను ఎన్నికల కమిషన్కు సమర్పించే అఫిడవిట్లో అభ్యర్థులు పేర్కొన్నారు. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తన తాజా నివేదికలో ఈ సమాచారాన్ని వెల్లడించింది. దేశంలో ఈనెల 18న రెండో దశలో భాగంగా ఎంపీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,644 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేయనున్నారు. వీరిలో 251 మంది(16శాతం)పై నేరపూరిత కేసులుండగా అందులోనూ 167 మందిపై తీవ్రమైన నేరపూరిత కేసులున్నాయి. ప్రధాన పార్టీల వారీగా చూసుకుంటే.. క్రిమినల్ కేసులు కలిగిన అభ్యర్థుల సంఖ్య కాంగ్రెస్ నుంచి అధికంగా ఉన్నది. ఈ పార్టీ నుంచి రెండో దశలో 53 మంది పోటీచేయనుండగా 23 మందిపై కేసులున్నాయి. అలాగే బీజేపీ(16), బీఎస్పీ(16), డీఎంకే(11), శివసేన(4), ఏఐఏడీఎంకే(3)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే 17 మందిపై 'తీవ్రమైన క్రిమినల్ కేసు'లతో కాంగ్రెస్17 మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ(10), బీఎస్పీ(10), డీఎంకే(7), ఏఐఏడీఎంకే(3), శివసేన(1)లు ఉన్నాయి. కాగా, తమపై ఉన్న కేసుల్లో దోషులుగా తేలామని ముగ్గురు తెలిపారు. అలాగే ఆరుగురిపై హత్యాపూరిత కేసులు, 25 మందిపై హత్యాయత్నానికి సంబంధించిన కేసులు, ఎనిమిది మందిపై కిడ్నాప్ కేసులు, మహిళలపై లైంగికదాడి, వేధింపులు వంటి కేసులు పది మందిపై ఉన్నాయి. ఇక 423 మంది అభ్యర్థులు ఆస్తుల విలువ ఒక కోటి రూపాయల కంటే పైగా ఉన్నది. ఇందులోనూ 46 మందితో కాంగ్రెస్ ముందు వరుసలో ఉండగా, బీజేపీ 45 మందితో తర్వాతి స్థానంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.31.83 కోట్లుగా, బీజేపీది రూ.21.59 కోట్లుగా ఉన్నది. కాగా, 16 మంది అభ్యర్థులు తమకు ఆస్తులే లేవని పేర్కొనడం గమనార్హం. రూ.417 కోట్లకు పైగా సంపదతో కాంగ్రెస్ పార్టీ తరఫున కన్యాకుమరి నుంచి పోటీచేస్తున్న హెచ్. వసంతకుమార్ సంపన్న అభ్యర్థిగా నిలిచారు. తర్వాతి స్థానాలలో కాంగ్రెస్ పార్టీకే చెందిన పూర్నియా(బీహార్) అభ్యర్థి ఉదరుసింగ్(రూ.341 కోట్లకు పైగా), బెంగళూరు రూరల్ అభ్యర్థి డి.కె సురేశ్(రూ.338 కోట్లకు పైగా)లు ఉన్నారు. ఇక హిందూస్థాన్ జనతా పార్టీ సోలాపూర్(మహారాష్ట్ర) అభ్యర్థి శ్రీవెంకటేశ్వర్ మహాస్వామీజీ తన పేరు మీద ఉన్న ఆస్తి కేవలం రూ.9గా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని రారుగంజ్ నుంచి ఇండిపెండెంట్గా పోటీచేస్తున్న బినోరుకుమార్ రూ.18 కోట్లకుపైగా, బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీకి దిగుతున్న సిబికె రామ రూ.15 కోట్లకు పైగా ఆస్థులున్నట్టు ప్రకటించారు. కాగా, సరైన పత్రాలు సమర్పించకపోవడం వంటి లోపాల కారణంగా 54 మంది అభ్యర్థులకు సంబంధించిన సమాచారం లభించలేదని ఏడీఆర్ తెలిపింది.