Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శబరిమలలో అరాచకాలకు పాల్పడ్డ వారినే అరెస్టు చేశాం:కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
తిరువనంతపురం : శబరిమల అంశంపై ప్రధాని మోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. కొల్లాంలో జరిగిన ఎల్డీఎఫ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప పేరు చెబితే జైళ్లో వేస్తున్నారన్న మోడీ వ్యాఖ్యలను ఖండించారు. శబరిమలలో భక్తుల పేరిట అక్రమాలు, నేరాలు చేసేవారిని మాత్రమే అరెస్టు చేశామని స్పష్టం చేశారు. నిందితులు.. భక్తులు, పోలీసులపై కొబ్బరిబొండాలు, రాళ్లు విసిరితేనే పోలీసులు వారిని అరెస్టు చేశారని అన్నారు. మిగతా రాష్ట్రాలలో ఈ తరహా నేరాలకు పాల్పడేవారిపై చర్యలుండబోవనీ, వారిని మోడీ కాపాడతారని విమర్శించారు. కానీ ఇది కేరళలో కుదరదని హెచ్చరించారు. శబరిమల అంశంతో దేశాన్ని మోడీ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని తెలిపారు. ప్రధాని పదవికున్న గౌరవాన్ని మోడీ కాపాడాలని విజయన్ కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం చెప్పినట్టుగానే అమలుచేశామని వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్లు పార్టీలుగా వేరైనా వాటి విధానాలు ఒకటేనని అన్నారు. కేరళలో ఈ రెండు పార్టీలు కలిసి పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. దేశ ప్రధానిగా మన్మోహన్ ఉన్నా.. మోడీ ఉన్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదనీ.. ఇద్దరూ సరళీకృత ఆర్థిక విధానాల్ని వేగంగా అమలుచేశారని విమర్శించారు. దేశంలో మార్పు రావాలంటే ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాల్సిన అవసరముందని విజయన్ ఆకాంక్షించారు.