Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హేమంత్ కర్కరేపై బీజేపీ అభ్యర్థి
- సాధ్వి వాదాస్పద వ్యాఖ్యలుల
భోపాల్ : మాలేగావ్ పేలుడు కేసులో ప్రధాన నిందితురాలు, మధ్యప్రదేశ్లోని భోపాల్ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 26/11 ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన ఐపీఎస్ హేమంత్ కర్కరే.. తాను శపించడం వల్లే చనిపోయారని వివాదాస్పద బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. మాలేగావ్ పేలుడు కేసులో హేమంత్ కర్కరే తనను ఇరికించారని ఆరోపించారు. అందుకే హేమంత్ను శపించానని, ఆ శాపం వల్లే 26/11 దాడిలో ఆయన ఉగ్రవాదుల చేతిలో చనిపోయారని శుక్రవారం ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. 'ముంబై జైలు నుంచి నన్ను విడుదల చేసేందుకు ఆయన అంగీకరించలేదు. ఎలాగైనా ఆధారాలు సేకరిస్తారని చెప్పారు. అదీ హేమంత్ కుటిలత్వం, వంచనతత్వం. ఇది మతానికి విరుద్ధమ'ని ఆమె తెలిపారు. 'నీవు నాశనమైపోతావ్ అని హేమంత్ను శపించాను. సరిగ్గా నేను శపించిన తర్వాత రెండు నెలల్లోపే ఆయనను ఉగ్రవాదులు చంపేశార'ని అన్నారు. 2008లోనూ అప్పటి ప్రభుత్వాన్ని శపించానని, ఇప్పుడు ఆ సర్కారు లేదని వ్యాఖ్యానించారు. కాగా, ఆరోగ్య కారణాలతో బెయిల్పై విడుదలైన సాధ్వి.. అవే కారణాలతో కోర్టు విచారణకు హాజరుకావడం లేదు గానీ, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నదని, కోర్టును ఆమె పక్కదారి పట్టిస్తున్నదని మాలేగావ్ పేలుడులో కొడుకును కోల్పోయిన ఓ తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అమర వీరుల త్యాగాలను గౌరవించండి : ఐపీఎస్ అసోసియేషన్
సాధ్వి ప్రగ్యా వ్యాఖ్యలను ఇండియన్ పోలీస్ సర్వీస్(సెంట్రల్) అసోసియేషన్ ఖండించింది. హేమంత్ కర్కరేను దేశద్రోహి అని, తన శాపం వల్లే మరణించారని ఒక అభ్యర్థి అవమానకర వ్యాఖ్యలు చేశారని వివరించింది. అశోక్ చక్ర అవార్డు గ్రహీత హేమంత్ కర్కరే ఐపీఎస్.. ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేసింది. ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరినీ గౌరవించాల్సిందిగా డిమాండ్ చేసింది.
బీజేపీ చర్యలు తీసుకుంటుందా?:
యాంటి టెర్రరిస్టు స్క్వాడ్ మాజీ చీఫ్, వీరయోధుడు హేమంత్ కర్కరేపట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్పై బీజేపీ చర్యలు తీసుకుంటుందా? అని సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులతోపాటు పలువురు ప్రశ్నలు సంధించారు. 26/11 దాడిలో ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన హేమంత్ కర్కరేపై చౌకబారు వ్యాఖ్యలు చేసిన సాధ్విపై బీజేపీ చర్యలు తీసుకుంటుందా? అని పీడీపీ నేత మెహబూబా ముఫ్తి ట్వీట్ చేశారు. పోలీసులను, భద్రతాబలగాలను గౌరవిస్తున్నట్టు చెప్పుకునే బీజేపీ ఈ వ్యాఖ్యలను సమర్థిస్తుందా? అని ప్రశ్నించారు. '26/11 హీరో హేమంత్ కర్కరేను సాధ్వి అవమానించింది. ఇప్పుడు జాతి ద్రోహులు ఎవర'ంటూ బర్ఖా దత్ ట్వీట్ చేశారు. తప్పుడు వీడియోలతో జేఎన్యూ విద్యార్థులను ఉగ్రవాదులని సంబోధించిన కొన్ని మీడియా సంస్థలు, వాటి ప్రతినిధులు.. ఇప్పుడు ఒక ఉగ్రవాదికి టికెట్ ఇచ్చిన బీజేపీ పార్టీని ఉగ్రవాద పార్టీ అని పిలుస్తాయా? అంటూ కవితా కృష్ణన్ సవాలు చేశారు.