Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ యూపీ చీఫ్ రాజ్బబ్బర్
న్యూఢిల్లీ : ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ మాట్లాడుతున్న తీరును ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రాజ్బబ్బర్ తప్పుబడుతున్నారు. ప్రధాని స్థాయిలో ఉన్నవారు ఈ విధంగా మాట్లాడకూడదనీ, తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మళ్లీ మోసం చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారనీ ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ నిత్యం అబద్ధాలు చెబుతున్నారనీ అన్నారు. ప్రధాని చెప్పే విషయాల న్నింటిపైనా అనేక సందేహాలు ఏర్పడ్డాయనీ, రాఫెల్ ఒప్పందంలో ప్రధాని తీరు ఎన్నో సందేహాలు కలగజేసిందనీ, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సైతం పున:పరిశీలిస్తోందనీ ఆయన అన్నారు.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని ఫతేపురి సిక్రీ స్థానం నుంచి రాజ్బబ్బర్ పోటీ చేస్తున్నారు. పశ్చిమ యూపీలో కాంగ్రెస్ గత వైభవాన్ని పొందాలంటే ఈ స్థానంలో రాజ్బబ్బర్ గెలుపు తప్పనిసరి. రెండోదశ పోలింగ్లో భాగంగా ఏప్రిల్ 18న ఇక్కడ పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన అనంతరం శుక్రవారం రాజ్బబ్బర్ విలేకర్ల సమావేశంలో పలు విషయాలు మాట్లాడారు. ప్రధాని మోడీ చేస్తున్న ఎన్నికల ప్రచారం, స్థానికంగా వివిధ పార్టీల నాయకులు ఆయనపై చేసిన విమర్శల గురించి ప్రస్తావించారు.
యూపీఏ హయాంలో అన్నివర్గాల ప్రజల కోసం కాంగ్రెస్ పనిచేసిందని చెప్పారు. పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో రైతు రుణ మాఫీ చేశామని అన్నారు. మోసపూరిత వాగ్దానాలతో ఓట్లను దండుకోవడానికి ప్రధాని మోడీ మళ్లీ ప్రయత్నిస్తున్నారనీ, దీనిని అందరూ గమనించాలనీ యూపీ ఓటర్లను ఆయన కోరారు.