Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడవి బిడ్డలను తరిమేసే మైనింగ్ విస్తరణ కోసం ఖర్చు
న్యూఢిల్లీ: అటవీ ప్రాంతాల్లో గనుల తవ్వకాల వల్ల నష్టపోతున్న ఆదివాసీల అభ్యున్నతే లక్ష్యంగా ఉప ప్రణాళికను అమలు చేయాలని యూపీఏ హయాంలో ప్రణాళికా సంఘం సిఫారసు చేసింది. సంబంధిత మంత్రిత్వశాఖలకు కేటాయించిన బడ్జెట్ నిధుల నుంచి కొంత భాగాన్ని ఈ ఉపప్రణాళిక కోసం బదిలీ చేయాలని ప్రణాళికా సంఘం సూచించింది. దీని కింద కొన్నేండ్లుగా వందల కోట్లు సమకూర్చారు. అయితే, ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి..? ఆ నిధుల్ని ఎందుకోసం ఖర్చు చేశారు..? ఈ ప్రశ్నలకు సమాధానలు వెతికే ప్రయత్నంలో పలు వాస్తవాలు వెలుగు చూశాయి.
గిరిజనుల అభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధుల్ని, వారిని తమ నివాస ప్రాంతాల నుంచి తరిమి వేసేటందుకు ఖర్చు చేశారన్నది ఉప ప్రణాళిక అమలు తీరుపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది. బొగ్గు లేదా ఇతర ఖనిజాలను వెలికితీసే ప్రాంతాల్లో గిరిజనులకు ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించడానికి వినియోగించాల్సిన నిధుల్ని అందుకు పూర్తిగా విరుద్ధమైన పనులకు ఖర్చు చేసినట్టు తేలింది. సమాచార హక్కు చట్టం కింద పలువురు జర్నలిస్టులు సేకరించిన వివరాల్లో ఇది స్పష్టమైంది. కేంద్రంలో మోడీ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, దాని స్థానంలో నిటి ఆయోగ్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉపప్రణాళిక పేరును ఆదివాసీ భాగం(ఎస్టీ కాంపోనెంట్)గా నిటి ఆయోగ్ మార్చింది. ఉప ప్రణాళిక కోసం కేటాయించిన నిధుల్ని గిరిజనుల అభివృద్ధి పథకాల కోసం మాత్రమే వినియోగించాలని ప్రణాళికా సంఘం స్పష్టం చేసింది. అందుకు బడ్జెట్లో బొగ్గు మంత్రిత్వశాఖకు కేటాయించిన నిధుల నుంచి 8.2 శాతం, గనులశాఖ నిధుల నుంచి 4 శాతం పక్కకు పెట్టాలని తెలిపింది. ఈ రెండు మంత్రిత్వశాఖలు ప్రతి ఆర్థిక సంవత్సరం ఉప ప్రణాళిక నిధుల్ని డిపాజిట్ చేశాయి. అయితే, ఆ డబ్బంతా గిరిజనుల అభివృద్ధి కోసమే ఖర్చు చేశారా..?
2010-11 నుంచి 2017-18 వరకు ఈ రెండు మంత్రిత్వశాఖలు ఉప ప్రణాళిక కోసం ఇచ్చిన నిధులెంత..? వాటిని ఎందుకోసం ఖర్చు చేశారో ఆర్టీఐ చట్టం కింద సేకరించిన వివరాల్ని పరిశీలిస్తే.. ఆ నిధుల్ని గిరిజనుల మేలు కోసం కాకుండా, వారికి నష్టం కలిగించే పనుల కోసం ఖర్చు చేశారని తేలింది.
అభివృద్ధా , విధ్వంసమా..?
బొగ్గు మంత్రిత్వశాఖ నుంచి తీసుకున్న వివరాల ప్రకారం ఆ నిధుల్ని ప్రభుత్వ బొగ్గు కంపెనీలైన సీసీఎల్, ఎస్సీసీఎల్, ఎంసీఎల్కు అందించారు. అయితే, ఈ కంపెనీలు ఆ నిధుల్ని ఖర్చు చేసింది మాత్రం బొగ్గు నిక్షేపాల్ని అన్వేషించడం కోసం, డ్రిల్లింగ్ కోసం, గనుల భద్రత కోసం. అంటే మరిన్ని గనుల్ని గుర్తించడం ద్వారా తవ్వకాల్ని విస్తరించే ప్రణాళికల్ని సిద్ధం చేయడం కోసం ఆ నిధుల్ని ఖర్చు చేశారన్నమాట. గిరిజనుల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిధుల్ని మరిన్ని గనుల్ని గుర్తించి, తవ్వకాల్ని ప్రారంభించడం కోసం వినియోగించారు. అంటే గనుల తవ్వకాలు జరిపే ప్రాంతాల నుంచి గిరిజనులను స్థానభ్రంశం చేయడం ఆ తర్వాతి కార్యక్రమమని అర్థం చేసుకోవాలి.
గనుల మంత్రిత్వశాఖ కింద పని చేసే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)కి 2010-11 నుంచి 2017-18 వరకు ఉప ప్రణాళిక నిధుల్ని రూ.6621 లక్షలు అందించారు. కోల్కతా, నాగపూర్, జైపూర్, హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్లోని జీఎస్ఐకి చెందిన కేంద్రాలు ఆ నిధుల్ని ఖనిజ నిక్షేపాల అన్వేషణ కోసం ఖర్చు చేశాయి. గిరిజన ఉప ప్రణాళిక నిధుల్ని తాము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడంలేదని, ప్రభుత్వ బొగ్గు కంపెనీలు, కేంద్ర గనుల ప్రణాళిక, నమూనా ఇనిస్టిట్యూట్ లిమిటెడ్(సీఎంపీడీఐఎల్)కు ఇస్తున్నామని బొగ్గు మంత్రిత్వశాఖ తెలిపింది. 2011-12 నుంచి 2017-18 వరకు ఈ సంస్థలకు రూ.205 కోట్లు విడుదల చేసినట్టు బొగ్గుశాఖ తెలిపింది. కాగా, ఈ నిధుల్ని బొగ్గు నిక్షేపాల్ని గుర్తించడం, తవ్వకాలు జరపడం, గనుల సంరక్షణ కోసం వినియోగించడం గమనార్హం.
సీఎంపీడీఐఎల్ ఇచ్చిన సమాచారం ప్రకారం 2011-18 మధ్య అందిన రూ.41.59 కోట్లను ప్రాంతీయంగా బొగ్గు నిక్షేపాలను గుర్తించడం కోసం ఖర్చు చేసినట్టు తెలిపింది. సీఎంపీడీఐఎల్కు డ్రిల్లింగ్ కోసం రూ.82.32 కోట్లు కూడా అందాయి. ఆ నిధుల్ని ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లోని 20 బ్లాకుల్లో బొగ్గు నిక్షేపాల్ని గుర్తించేందుకు వాడారు. ఇప్పటికే ఈ సంస్థ 14 బ్లాకుల భౌగోళిక నివేదికను అందించింది. మరో ఆరు బ్లాకుల్లో సర్వే పనులు పురోగతిలో ఉన్నాయి.
2011 జనగణన ప్రకారం గిరిజనులు లేని రాష్ట్రాలకు కూడా ఉప ప్రణాళిక నిధులు అందించినట్టు 2015 నుంచి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఇచ్చిన నివేదికలు తేల్చాయి. ఉప ప్రణాళిక నిధుల్ని వినియోగించకపోతే వాటిని గిరిజన వ్యవహారాలశాఖకు బదిలీ చేయాలని 2010లోనే ప్రణాళికా సంఘం సూచించినా, ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. గత ఏడు,ఎనిమిది సంవత్సరాలుగా జౌళిశాఖ బడ్జెట్ నిధుల్లో 1.2 శాతం మాత్రమే గిరిజన ఉప ప్రణాళిక కోసం పక్కకు పెట్టినట్టు తేలింది. మిగతా నిధుల్ని ఇతర కార్యక్రమాల కోసం వినియోగించారు. ఉదాహరణకు 2017-18 బడ్జెట్ నిధుల్లో ఈ శాఖ నుంచి 6.2 శాతం గిరిజన ఉప ప్రణాళికకు కేటాయించారు. ఆ మొత్తం రూ.61.81 కోట్లు. కాగా, అందులో రూ.30 కోట్లు నేషనల్ హ్యాండ్లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు బదిలీ అయ్యాయి.
మీడియా పరిశోధనలో మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. సెంట్రల్ వూల్ డెవలప్మెంట్ బోర్డును ఆర్టీఐ చట్టం కింద అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ 2011-18 మధ్యకాలంలో తమకు ఉప ప్రణాళిక కింద రూ.7 కోట్లు అందాయని తెలిపింది. అందులో రూ.6.63 కోట్లు వ్యక్తులకు కాకుండా సంస్థలకు ఇచ్చామని తెలిపింది. అయితే, ఆ నిధులు అందుకున్న సంస్థల పేర్లు తమ రికార్డుల్లో లేవంటూ చేతులెత్తేసింది.
గిరిజన మంత్రిత్వశాఖ ఏం చేస్తోంది..?
దేశంలోని గిరిజనుల అభివృద్ధి కోసం ఓ మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేశారు. ఉప ప్రణాళిక నిధుల్ని ఇతర కార్యక్రమాల కోసం ఖర్చు చేయడంపై 2015లో గిరిజన మంత్రిత్వశాఖ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. కానీ, అది ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించలేదు. గిరిజనశాఖ ప్రకారం 37 మంత్రిత్వశాఖల కింద 289 పథకాలకు ఉప ప్రణాళిక నిధుల్ని కేటాయిస్తున్నారు. ఆ నిధుల్ని ఎందుకోసం ఖర్చు చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. గట్టిగా నిలదీసి అడిగితే..
ఆ నిధుల్ని ఇతర కార్యక్రమాల కోసం ఖర్చు చేయకుండా రాజ్యాంగపరమైన, చట్టపరమైన నిబంధన ఏమీ లేదని ప్రభుత్వం తప్పించుకునే వీలున్నది. అయితే, ఇది నైతికంగా సరైందేనా..? అన్నదే ప్రశ్న. ఓ లక్ష్యం కోసం కేటాయించిన నిధుల్ని ఇతర కార్యక్రమాలకు మళ్లించడం, అంతేగాక పూర్తిగా ఆ లక్ష్యానికి విరుద్ధమైన పనుల కోసం ఖర్చు చేయడం నైతిక నేరం కాదా..? అని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు.