Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఒకే అత్యవసర హెల్ప్లైన్ నెంబర్ 112ను ఉపయోగించే పాన్-ఇండియా నెట్వర్క్లో 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేరినట్టు హౌంశాఖ అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరిగినపుడు గాయపడినవారికి అత్యవసర సేవల కోసం 108కి, పోలీసుల సహాయం కోసం 100కి, గ్రామీణ వైద్య సేవల కోసం 104కి... ఇలా ఒక్కో సర్వీస్ కోసం ఒక్కో నెంబర్కు డయల్ చేయడం ఇప్పటివరకూ మనం అనుసరించిన పద్ధతి. ఈ నెంబర్లు రాష్ట్రాలనుబట్టి మారిపోతుంటాయి. దాంతో, ఒకే ఒక్క హెల్ప్లైన్ నెంబర్ ద్వారా అన్ని రకాల అత్యవసర సేవల కోసం 112ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ నెంబర్ను కొన్ని రాష్ట్రాల్లో వినియోగిస్తుండగా, తాజాగా మరిన్ని రాష్ట్రాలకు విస్తరించారు. పాన్-ఇండియా నెట్వర్క్ పరిధిలోకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, గుజరాత్,జమ్మూకాశ్మీర్, నాగాలాండ్, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్,నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యు వచ్చాయని అధికారులు తెలిపారు. అమెరికాలో ఇలాంటి సర్వీస్ను ఇప్పటికే అమలు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి అత్యవసర సహాయానికైనా 911కు ఫోన్ చేస్తే సరిపోతుంది. సంబంధిత అధికారులు స్పందిస్తారు.
ఇప్పుడు దేశంలోనూ ఈ నెట్వర్క్ పరిధిలోని రాష్ట్రాల్లో అత్యవసర సాయం కావాలనుకునేవారు 112కు డయల్ చేస్తే, అది సమీపంలోని నెట్వర్క్ టవర్ ద్వారా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్(ఈఆర్సీ)కి అనుసంధానమవుతుంది. స్మార్ట్ ఫోన్ ద్వారా అయితే జీపీఎస్ సౌకర్యం ఉండటం వల్ల సంబంధిత అధికారులు వేగంగా స్పందించేందుకు, బాధితులు ఏ ప్రాంతంలో ఉన్నది గుర్తించేందుకు వీలు కలుగుతుంది. స్మార్ట్ ఫోన్లో అయితే పవర్ బటన్ను మూడుసార్లు నొక్కడం ద్వారా, సాధారణ ఫోన్లలో అయితే 5 లేదా 9పై లాంగ్ ప్రెస్(ఎక్కువసేపు ఒత్తి పట్టడం) ద్వారా 112కు కాల్ చేసే అవకాశం లభిస్తుంది. ది ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్(ఈఆర్ఎస్ఎస్) అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ కావడం ద్వారా మనకు కావాల్సిన అత్యవసర సేవల్ని పొందే వీలున్నది. ఇందుకోసం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లో 112 ఇండియా మొబైల్యాప్ను ఫ్రీగా అందుబాటులో ఉంచారు. కేంద్రం చేపట్టిన ఈ అత్యవసర సేవల నిర్వహణ కోసం నిర్భయ నిధుల నుంచి రూ.321.69 కోట్లు కేటాయించారు. ఇప్పటికే రూ.278.66 కోట్లు విడుదల చేశారు. మహిళా,శిశుఅభివృద్ధిశాఖ కార్యదర్శి నేతృత్వంలోని సాధికారక కమిటీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది.