Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీహార్ జైలులో ఘటన
- దర్యాప్తునకు ఢిల్లీ కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : తీహార్ జైలులో ఓ ముస్లిం ఖైదీ వీపు మీద బలవంతంగా ఓం గుర్తును ముద్రించిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. జైలు సూపరింటెండెంట్ బలవంతంగా ఖైదీ నబ్బీర్ వీపు మీద ఓం ముద్రవేసినట్టు ఆరోపణలు వచ్చాయి. విచారణ ఖైదీ నబ్బీర్ తల్లి కోర్టును ఆశ్రయించటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విచారణ చేపట్టిన కోర్టు ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. జైలు సూపరింటెండెంట్ రాజేశ్ చౌహాన్ తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నట్టు బాధితుడు తన తల్లికి చెప్పగా ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన ఢిల్లీ కోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. 'నిందితుడు లేవనెత్తిన ఆరోపణలు చాలా తీవ్ర స్వభావం కలిగినవి. తక్షణ జోక్యం అవసరం. నిందితుడికి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహిచాలి. నివేదిక అందచేయాలి' అని కోర్టు పేర్కొంది. ఇతర ఖైదీల వాంగ్మూలంతోపాటు, సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరించాలని కోర్టు డీజీపీని ఆదేశించింది. జైలులో ఖైదీల భద్రతకు చర్యలు తీసుకోవాలని, జైలు సూపరింటెండెంట్ రాజేశ్ చౌహాన్ను ప్రత్యక్ష, పరోక్ష పర్యవేక్షణ నుంచి తక్షణమే తొలగించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీచేసింది. బాధితుడి తల్లి ఫిర్యాదు ప్రకారం.. నబ్బీర్ తీహార్ జైలులో విచారణ ఖైదీ.. వారం రోజుల క్రితం అతను తమ బ్యారక్లోని ఇండక్షన్ స్టవ్ సరిగా పని చేయడంలేదని అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వారు నబ్బీర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్లి చితకబాదారు. అప్పటికీ వారి ఆగ్రహం చల్లారలేదు. మెటల్ ఓం సింబల్ని తీసుకొచ్చి.. కాల్చి దాన్ని నబ్బీర్ వీపు మీద ముద్రించారు. ఓ రెండు రోజుల పాటు అతనికి భోజనం కూడా పెట్టలేదు. నబ్బీర్ హిందువుగా మారాడనీ, ప్రస్తుతం నవరాత్రి దీక్ష చేస్తున్నాడనీ, దానిలో భాగంగానే ఉపవాసం చేస్తున్నాడనీ తోటి ఖైదీలను నమ్మబలికారు. నబ్బీర్ను చూసేందుకు వెళ్ళిన కుటుంబసభ్యులకు నబ్బీర్ జైలులో పెడుతున్న చిత్రహింసల గురించి తెలిపాడు. దాంతో అతడి తల్లి కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఈ నెల 17న నబ్బీర్ కేసు ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది. తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తిచేశారు.