Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిడుగులు పడి ఆరుగురు, గాలులకు మరో ఇద్దరు
విజయవాడ: శనివారం సాయంత్రం వివిధ జిల్లాల్లో వీచిన ఈదురుగాలులకు, పిడుగుపాటుకు గురై 8 మంది మృతి చెందారు. వీరిలో ఐదుగురు గుంటూరు జిల్లాకు చెందిన వారు కాగా, నెల్లూరు, విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. పై జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. ఈ జిల్లాల్లో వర్షం, ఈదురుగాలులతో మామిడి, జీడిమామిడి, అరటి, నిమ్మ, టమాట తదితర రైతులకు తీవ్ర నష్టం సంభవించింది. పలు రహదారుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయమేర్పడింది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలేనికి చెందిన గుమ్మా చిర్రయ్య(40), నూజెండ్ల మండలం ముతరాసుపాలేనికి చెందిన చిక్కుడు వెంకట కోటయ్య(37) పశువులు మేపి తిరిగి ఇళ్లకు చేరుతుండగా, కారంపూడి మండలం ఒప్పిచర్లకు చెందిన మస్తాన్బీ పొలం వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగులు పడి మృతిచెందారు. ఈపూరు మండలం అగ్నిగుండాలలో సంగటి వెంకటేశ్వరరెడ్డి (70) అనే రైతు తన పొలంలోనే చెట్టు కింద ఉండగా లస్కర్గా విధుల్లో ఉన్న వినుకొండ ఎన్ఎస్పి కాలనీకి చెందిన కర్రా శ్యాంసన్(57) వర్షం పడుతున్న సమయంలో చెట్టు కింద నిల్చోగా, చెట్టుకొమ్మలు విరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. నెల్లూరు జిల్లా మర్రిపాడులో నిమ్మ చెట్టు వద్ద వేచి ఉండగా పిడుగుపాటుకు గురై సత్యాల చిన్నయ్య (43) మృతిచెందాడు. విశాఖ వేపగుంట ఎగ్జిబిషన్ మైదానంలో సిమెంట్ లోడ్ దించడానికి ఐదుగురు కళాసీలు వెళ్లిన సమయంలో వర్షం పడటంతో ఈశ్వరరావు(40) అనే కళాసీ చెట్టు కిందకు వెళ్లాడు. ఆ సమయంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం టి.బూర్జివలసలో నడిచివెళ్తున్న అరసాడ చంద్రమ్మ (55) గాలుల తీవ్రతకు రహదారిపైనే పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ జిల్లాల్లో మూగజీవాలు కూడా పిడుగుపాటుకు మృతిచెందాయి.
వడదెబ్బకు వ్యక్తి మృతి
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జీవన్ కిరాణా షాపు లో కూలిగా పనిచేస్తున్న బరాటం మురళి (36) శనివారం వడదెబ్బకు మృతి చెందారు. హడ్కోకాలనీలో నివాసముం టున్న ఆయన భోజనం అనంతరం విధులకు సైకిల్పై వెళ్తుండగా... రైల్వే యూనియన్ కార్యాలయం గేటు వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు.