Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్షాల గెలుపునకు కృషి చేయాలంటూ ఆమాద్మీ పిలుపు
- బీజేపీ, ఎన్డీయే పక్షాల ఓటమే లక్ష్యంగా ముందుకు : మీడియా సమావేశంలో ఆప్ నేత సోమనాథ్ భారతి వెల్లడి
- స్వాగతించిన సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు నీలోత్పల్ బసు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కేరళలో సీపీఐ(ఎం) నేతత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఆమాద్మీ పార్టీ (ఆప్) మద్ధతు ప్రకటించింది. రాష్ట్రంలో ఎల్డీఎఫ్ అభ్యర్థులు పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో తమ పార్టీ రాష్ట్ర కమిటీ బాసటగా నిలుస్తుందని ఆప్ సీనియర్ నేత సోమనాథ్ భారతి మీడియాకు తెలిపారు. శనివారం ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమనాథ్ భారతి సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు నీలోత్పల్ బసుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆప్ నాయకుడు భారతి మాట్లాడుతూ... వామపక్ష అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని తమ పార్టీ కేరళ కమిటీకి ఇప్పటికే తెలియజేశామన్నారు. కార్మిక, కర్షక సమస్యలపై అనునిత్యం పోరాడే కమ్యూనిస్టులు చట్ట సభల్లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్డీఎఫ్ గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఈ మేరకు తమ పార్టీ అత్యున్నత కమిటీలో తీర్మానం కూడా చేసినట్టు ఆయన వివరించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీని ఎక్కడికక్కడ ఓడించడమే తమ ఉమ్మడి లక్ష్యమని చెప్పారు. బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించేందుకు కలసి వచ్చే ప్రతి ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలతో తాము ఎన్నికల బరిలో నిలుస్తామన్నారు. సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నీలోత్పల్ బసు మాట్లాడుతూ ఆప్ నాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఏకం కావడం ప్రస్తుతం చారిత్రక అవసరమని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి వ్యక్తి పోరాడాలన్నారు. కేరళలో గతం కంటే ఈ ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆమాద్మీ నాయకులు బిశ్వావ్, గోపాల్ రారు, అతిశీ తదితరులు పాల్గొన్నారు.