Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దూసుకుపోతున్న ఎల్డీఎఫ్ అభ్యర్థి రాజీవ్
కొచ్చి : కేరళలో విభిన్న రాజకీయ ప్రత్యేకతలు కలిగిన ఎర్నాకులం పార్లమెంటు నియోజకవర్గంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నది. యూడీఎఫ్కు కంచుకోటగా పేరున్న ఎర్నాకులంలో ఎల్డీఎఫ్ తరుపున సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి పి రాజీవ్ను బరిలో నిలపడటంతో ఈ దఫా ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రచారంలోనూ ఆయన దూసుకుపోతున్నారు.
రాజ్యసభ సభ్యునిగా ఆరేండ్ల పాటు సేవలందించిన రాజీవ్ సమర్థవంతమైన పార్లమెంటేరియన్గా, పాలనాధ్యక్షునిగా విశేషమైన గుర్తింపు పొందారు. రాజ్యసభలో సభా నిర్వహణకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉత్పన్నమైనప్పుడు సకాలంలో జోక్యం చేసుకొని రాజ్యాంగపరమైన, నిర్వహణా నిబంధనావళిని వివరించి వాటిని నివృత్తి చేయడంలో రాజీవ్ చేసిన కృషికి ప్రత్యర్థి సభ్యుల నుంచి సైతం ప్రశంలందాయి.
కాస్మోపాలిటన్ మెట్రో నగరంగా అభివృద్ధి చెందిన ఎర్నాకులం సంఘటిత, అసంఘటిత కార్మికులతో నిండివుంటుంది. నిత్యం ప్రజలతో మమేకమై మెలిగే రాజీవ్కు సాధారణ ప్రజానీకంతో ప్రత్యేకించి కార్మికులతో బలమైన సత్సంబంధాలుండటం ఎల్డీఎఫ్కు అదనంగా కలిసొస్చే అంశంగా కనిపిస్తోంది.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ప్రజలకు ఏవైనా ఇబ్బందులు, సమస్యలు ఎదురైనప్పుడు రాజకీయపరమైన జోక్యంతో వాటిని పరిష్కరించేందుకు రాజీవ్ ఎనలేని కృషి చేశారు. దీంతో ఇక్కడి ప్రజానీకంతో ఆయనకు విడదీయరానిబంధం ఏర్పడింది.
మెరుగైన వైద్య సేవలందించడంలో ఎర్నాకులంలోని ప్రభుత్వ సార్వజన ఆస్పత్రికి గొప్ప పేరుంది. ఎరఆర్ఐ స్కాన్ వంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండటమే గాకుండా చికిత్స పొందేవారికి వారి వ్యాధిని బట్టి ప్రత్యేకించిన డైట్తో ఆహారం అందించడం ఒక విశేషం. ఈ ఆసుపత్రిలో లీనియర్ యాక్సిలేటర్, ఎంఆర్ఐ స్కాన్ల వంటి ఆధునిక సదుపాయాలు, డైట్రీ కిచెన్ వంటివన్నీ కూడా రాజీవ్ రాజ్యసభ సభ్యునిగా ఉన్న కాలంలో ప్రత్యేక దృష్టి సారించి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారికి సఫర్యలు చేస్తూ వారిలో మనోధైర్యం నింపి చికిత్స అందించేందుకు ఉద్దేశించిన పల్లవేటివ్ కేర్ ప్రాజెక్టు రాజీవ్ మది నుంచి ఊపిరి పోసుకున్న ప్రాజక్టే. ఈ పథకం ద్వారా ఇప్పుడు వేలాది మందికి ఉపశమనం లభిస్తోంది. వామపక్షాలకున్న కార్మిక పునాధికి రాజీవ్ పనితీరు, కృషి తోడ్పడితే ఎర్నాకులంలో ఎర్రజెండా రెపరెపలు ఖాయమనిపిస్తోంది.
సిట్టింగ్ అభ్యర్థిని కాదని చిక్కుల్లో యూడీఎఫ్
కాంగ్రెస్ ఎమ్మెల్యే హిబే ఈడెన్ను రాజీవ్పై పోటీగా యూడీఎఫ్ బరిలోకి దింపింది. ఎర్నాకులం సిట్టింగ్ ఎంపీ డాక్టర్ కెవి థామస్ను విస్మయానికి గురిచేస్తూ అనూహ్యంగా హిబే ఈడెన్ను కాంగ్రెస్ నాయకత్వం తెరపైకి తీసుకొచ్చి చిక్కుల్లో పడింది. నాలుగుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన థామస్ను పక్కకునెట్టి హిడెన్కు సీటు కేటాయించడంపై థామస్ గ్రూపు గుర్రుగా ఉంది. ఒకానొకదశలో బీజేపీలో చేరేందుకు కూడా థామస్ సిద్ధమయ్యారు. తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో చోటుచేసుకున్న సోలార్ ఫలకాల కుంభకోణంతో ముడిపడిన ఒక లైంగికదాడి కేసులో హిబే ఈడెన్ నిందితుడిగా ఉండటం యూడీఎఫ్కు మరో ప్రతికూల అంశం. ఇన్ని ప్రతికూలతల మధ్య ఈ దఫా ఎన్నికల్లో యూడీఎఫ్ కంచుకోట బీటలు బారడం తప్పదని విశ్లేషకుల అంచనా.