Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ మాజీ ఉద్యోగిని అఫిడవిట్
- నేర చరిత్ర ఉన్న మహిళను నాపై ప్రయోగించారు: రంజన్గొగొరు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్గొగోయ్ పై అదే కోర్టుకు చెందిన మాజీ ఉద్యోగియైన 35 ఏండ్ల మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. ఆరోపణలు చేసిన మహిళ జస్టిస్ రంజన్గొగోయ్ వద్ద జూనియర్ కోర్టు అసిస్టెంట్(జేసీఏ)గా 2016 అక్టోబర్ నుంచి 2018 అక్టోబర్ వరకు పని చేశారు. చీఫ్ జస్టిస్పై ఆరోపణలతో కూడిన అఫిడవిట్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికీ ఆమె ఈ నెల 19న పంపించారు. ఈ సంఘటన గతేడాది అక్టోబర్ 10,11 తేదీల్లో జరగగా, ఈ విషయంలో తన కుటుం బసభ్యులు కూడా ఇబ్బందుల పాలయ్యారని ఆ మహిళ ఆరోపించారు. తన కుటుంబసభ్యులు కొన్ని నెలలుగా అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చిందని ఆమె తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఢిల్లీ పోలీస్శాఖలో పని చేస్తున్న తన భర్త, ఆయన సోదరుడు సస్పెన్షన్కు గురయ్యారని ఆమె తెలిపారు. 2018, అక్టోబర్ 10న చీఫ్ జస్టిస్కున్న విచక్షణాధికారంతో నియమితులైన తన భర్త మరో సోదరుడు, ఆ తర్వాత అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించబడ్డారని ఆమె తెలిపారు. ఈ ఏడాది మార్చిలో తనను కూడా లంచం కేసులో అరెస్ట్ చేసినట్టు ఆమె తెలిపారు. తాను సుప్రీంకోర్టు ఉద్యోగం నుంచి తొలగించబడ్డ మూడు నెలలకు ఈ సంఘటన జరిగినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో తాను బెయిల్పై బయట ఉన్నట్టు ఆమె తెలిపారు. తనపై ఈ కేసును అక్రమంగా బనాయించారని, బెయిల్ రద్దు కోసం ఇటీవలే ఈ కేసును నేర విభాగానికి బదిలీ చేసి, విచారణను పాటియాలా హౌజ్కోర్టుకు మార్చారని ఆమె ఆరోపించారు. తన భర్తపైనా లంచం కేసు నమోదైనట్టు ఆమె తెలిపారు. మొదట సుప్రీంకోర్టు లైబ్రరీ విభాగంలో ఆమె ఉద్యోగంలో చేరారు. 2015 నుంచి జస్టిస్ విక్రమ్సేన్ కోర్టులో 8 నుంచి 10 నెలలపాటు పని చేశారు. వివిధ కేసులకు సంబంధించిన న్యాయశాస్త్ర గ్రంథాలు, గతంలో ఇచ్చిన తీర్పుల కాపీలను న్యాయమూర్తులకు అందించడం ఆమె పనిలో ఓ భాగం. ఆమెను జస్టిస్ గొగోయ్ కోర్టుకు 2016 అక్టోబర్లో మార్చా రు. మరోవైపు 2015లో ఆమె మీరట్లోని చౌదరీ చరణ్సింగ్ యూనివర్సిటీలో లా డిగ్రీలో చేరారు. తాను లా డిగ్రీ చేస్తున్న విషయం తెలుసుకున్న జస్టిస్ గొగోయ్ తనకు ఆయా కేసుల వివరాలు తెలియజేసే బాధ్యత కూడా అప్పగించినట్టు ఆమె తెలిపారు. ఓవైపు పనిలో భాగంగా తనను జస్టిస్ గొగోయ్ ఆయన చాంబర్కు పిలిపించుకొని తన కుటుంబం, తన కూతురు గురించి అడిగేవారని ఆమె తెలిపారు. జస్టిస్ గొగోయ్ ప్రయివేట్ ఫోన్లలో మాట్లాడే ఇద్దరు ఉద్యోగుల్లో తానొకరినని ఆమె తెలిపారు. 2018 అక్టోబర్లో తాను చీఫ్ జస్టిస్గా పదోన్నది పొందుతున్నందున పని భారం పెరుగుతుందని, అందువల్ల ఆమెను ఆయన ఇంట్లోని ఆఫీస్లో పని చేయాల్సిందిగా ఆగస్టులో కోరారని ఆమె వివరించారు. 2018, ఆగస్టు 11 నుంచి ఆమె జస్టిస్ గొగోయ్ ఇంట్లోని ఆఫీస్లో పని చేయడం ప్రారంభించినట్టు తెలిపారు. మొదట ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని ఉండేదని, ఆ తర్వాత ఆ సమయాల్ని మార్చినట్టు ఆమె తెలిపారు. జస్టిస్ గొగోయ్ ఇంటి నుంచి కోర్టుకు వెళ్లడానికి ముందు ఉదయం 8 గంటల వరకల్లా అక్కడికి చేరుకొని, ఆయన సాయంత్రం కోర్టు నుంచి తిరిగి వచ్చే వరకూ ఉండాలని చెప్పినట్టు ఆమె తెలిపారు. ఆయనకున్న మూడు ఆస్తుల్లో తాను ఒకరినని జస్టిస్ గొగోయ్ తనతో అన్నారని ఆ మహిళ తెలిపారు. మిగతా ఇద్దరు ఆయన భార్య, కూతురిగా ఆమెతో జస్టిస్ గొగోయ్ అన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2018, అక్టోబర్ 3న జస్టిస్ గొగోయ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాగా, అదే నెల 9న తన భర్త సోదరుడు(వికలాంగుడు) కోర్టులో జూనియర్ అటెండర్గా నియమితులయ్యారని ఆమె తెలిపారు.
లైంగిక వేధింపులు..?
అక్టోబర్ 10న ఉదయం ఆయన తనను ఆఫీస్కు పిలిపించారని ఆమె తెలిపారు. ఆరోజు తనతో మాట్లాడుతూ తన భర్త సోదరుడు వైద్య పరీక్షల్లో ఉద్యోగానికి అనర్హుడని తేలినా నియామకం ఇచ్చానని జస్టిస్ గొగోయ్ అన్నారని ఆమె తెలిపారు. ఆ సందర్భంగా ఆయన తనను తాకిన విధానం ఇబ్బందికరంగా భావించానని అఫిడవిట్లో ఆమె పేర్కొ న్నారు. సాధారణంగా నలుపు,తెలుపుతో కూడిన యూనిఫాం డ్రస్ ధరించేదాన్ని. కానీ, నవరాత్రుల్లో మొదటిరోజైన ఆరోజు మాత్రం ఆరెంజ్ కుర్తా, చున్నీ వేసుకున్నాను. అది చూసి ఈరోజు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారంటూ చీఫ్ జస్టిస్ కామెంట్ చేసినట్టు ఆమె తెలిపారు. మీరు నాకోసం ఏం చేస్తారని చీఫ్ జస్టిస్ అడిగినట్టు ఆమె తెలిపారు. తన ముందుకు రావాల్సిందిగా పిలిచారని, తన తల వెనక భాగం నుంచి మొదలుపెట్టి తన శరీరాన్ని తడమటం ప్రారంభించారని, దాంతో తాను వణికిపోయానని ఆమె తెలిపారు. వెంటనే తేరుకున్న చీఫ్జస్టిస్ తన బుగ్గలు లాగి నీవు నా కూతురితో సమానమంటూ అనునయించారని ఆమె తెలిపారు. మరుసటిరోజు(అక్టోబర్ 11న) తన నడుము చుట్టూ చేయి వేసి ఇబ్బందికరంగా ప్రవర్తించారని, నీ నుంచి నేను కోరుకునేది ఇదే అంటూ తనను గట్టిగా హత్తుకున్నారని, ఆ సమయంలో ఆయన్ని వెనక్కి తోసేశానని, దాంతో ఆయన తల బుక్షెల్ఫ్నకు తగిలిందని ఆమె తన అఫిడవిట్లో ఆరోపించారు. ఈ సంఘటనతో నిర్ఘాంతపోయిన తాను ఆ గది నుంచి బయటకు వెళ్లానని ఆమె తెలిపారు.
ఆమె వెనుక పెద్ద శక్తి.. : చీఫ్జస్టిస్ రంజన్గొగోయ్
తనపై మాజీఉద్యోగి చేసిన ఆరోపణల్ని చీఫ్ జస్టిస్ రంజన్గొగోయ్ ఖండించారు. తనపై ఆరోపణలు చేసిన మహిళ వెనుక పెద్ద శక్తి ఉన్నదని జస్టిస్ గొగోయ్ అన్నారు. ఆ మహిళకు నేర చరిత్ర ఉన్నదని ఆయన అన్నారు. ఆరోపణలు చేసిన మహిళపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, నాలుగురోజులపాటు జైలులో ఉన్నారని, ప్రవర్తన విషయంలో పోలీసులు కూడా ఆమెను హెచ్చరించారని జస్టిస్ గొగోయ్ తెలిపారు. ఇలాంటి వ్యక్తుల ఆరోపణలను పరిశీలించకుండా మీడియా సంస్థలు ప్రచురించడం తగదని ఆయన సూచించారు. న్యాయ వ్యవస్థ కోసం తాను 20 ఏండ్లుగా నిస్వార్థ సేవ చేశానని, తన బ్యాంక్ బ్యాలెన్స్ రూ.6 లక్షల 80 వేలు మాత్రమేనని, భవిష్యనిధి(పీఎఫ్) ఖాతాలో మరో రూ.40 లక్షల వరకూ ఉన్నట్టు ఆయన తెలిపారు. తనపై అవినీతి ఆరోపణలేమీ లేకపోవడంతో, తనపై దుష్ప్రచారానికి యోగ్యత లేని మహిళను ఉపయోగిస్తున్నారని గొగోయ్ విమర్శించారు. తాను వచ్చే వారం కొన్ని ముఖ్యమైన కేసులు విచారించాల్సి ఉన్న సందర్భంలో తనను అడ్డుకునేందుకే ఈ ఆరోపణలని చీఫ్ జస్టిస్ అనుమానాలు వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రధాని మోడీ బయోపిక్ విడుదల కేసు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసు, ఓటర్లకు పెద్ద మొత్తాల్లో డబ్బులు పంపిణీ చేసినందున తమిళనాడులోని 39 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ దాఖలైన కేసును వచ్చే వారం విచారించాల్సి ఉన్నది. న్యాయవ్యవస్థ స్వతంత్రత తీవ్ర బెదిరింపుల మధ్య నలుగుతున్నదని చీఫ్జస్టిస్ రంజన్గొగోయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మంచి వ్యక్తులు ఇందులోకి రావడానికి ఇష్టపడరని ఆయన అన్నారు. తానిలాంటి వాటికి చలించిపోకుండా తన విధులు తాను కొనసాగిస్తానని ఆయన తెలిపారు.
మీడియా విజ్ఞతకే..
చీఫ్ జస్టిస్పై వచ్చిన ఆరోపణలపై శనివారం పరిశీలన జరిపిన జస్టిస్ అరుణ్మిశ్రా, జస్టిస్ ఖన్నాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే మీడియాకు సూచనలు చేసింది. ఇటు వంటి వార్తల విషయంలో నిగ్రహం పాటించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు భంగం కలగకుండా చూడాలని చెబుతూనే, ఎలా ప్రచురించాలనే నిర్ణయాల్ని మీడియా విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు తెలిపింది.