Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీఎస్ ఆర్టీసీలో మాయాజాలం
- నాలుగేండ్లలో తెలియకుండానే బాదేశారు
- మళ్లీ చార్జీల పెంపునకు సన్నద్ధం
అమరావతి :''2015 నుంచి ఇప్పటి వరకూ బస్ ఛార్జీలను పెంచలేదు. నష్టాలు వస్తున్నా ఛార్జీలు పెంచక పోవడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాం. ఇప్పుడు పెంపు అనివార్యం'' అని ఆర్టిసి యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వాస్తవం దీనికి భిన్నం. ఆర్టీసీ యాజమాన్యం నాలుగేళ్లలో ప్రయాణికులకు తెలీకుండానే ఛార్జీలను వడ్డించింది. ఏకంగా 20 శాతం మేర ఈ పెంపు ఉంది. ఈ నాలుగేళ్లు ఛార్జీలన్న మాట అనకుండా ప్రజలపై భారాలు మోపిన ఆర్టీసీ ఇప్పుడు వివిధ కారణాల వల్ల పడిన ఆర్థిక భారం మొత్తాన్ని ఆ పేరు చెబుతూ ప్రయాణికులపైన మోపాలని చూస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఈ మేరకు ప్రతిపాదనలను అందించనుంది. 30శాతం ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఆర్టీసీి ఎండి రెండు రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగేళ్లలో ప్రజలపై మోపిన భారాలు క్లుప్తంగా రౌండప్తో రూ.315 కోట్ల భారం గతేడాది జూన్లో ప్రయా ణికులకు ఛార్జీలు పెంచామని తెలీకుండానే రౌండప్ పేరు తో భారీగా ఛార్జీలను పెంచేశారు. దీంతో ప్రయాణికులపై రూ.315 కోట్ల భారం పడింది. అన్ని సర్వీసుల్లో ఉన్న ఛార్జీలను తరువాతి రూ.5 స్థానానికి పెంచారు. వెన్నెల సర్వీసుల్లో ప్రస్తుత ఛార్జీని తరువాత రూ.పదికి రౌండప్ చేశారు. ఈ సవరించిన ఛార్జీలు గతేడాది జూన్ 22వ తేదీ అర్ధరాత్రి నుంచే అమల్లోకొచ్చాయి. చిల్లర సమస్యను అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఛార్జీల పెంపు నిర్ణయం వల్ల సామాన్యులపై పెను భారం పడింది. రూ.11, రూ.21, రూ.31 ఉన్న ఛార్జీలు ఏకంగా రూ.15, రూ.25, రూ.35కు, రూ.16, రూ.26, రూ.36 ఉన్న ఛార్జీలు రూ.20, రూ.30, రూ.40కు పెంచారు. ఇలాంటి ఛార్జీలు ఉన్న సర్వీసుల్లో ప్రయాణికునిపై ఒకే సారి రూ.నాలుగు భారం పడింది. 1 నుంచి 4 వరకూ అంకెలున్న ఛార్జీలు 5కు, 6 నుంచి 9 వరకూ ఉన్న ఛార్జీలు 10కి పెరచారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి ఉండికి గతంలో రూ.11 ఛార్జీ ఉండగా ఆ ఛార్జీ ఏకంగా 40 శాతం పెరుగుతూ రూ.15 అయింది. తొలుత తెలుగు వెలుగు మినహా అన్ని సర్వీసుల్లో ఛార్జీలు పెంచిన అధికారులు అదే ఏడాది జులై 1 నుంచి తెలుగు వెలుగు ఛార్జీల్లోనూ సవరణలు చేశారు. వాటిలో రూ.8, రూ.38, రూ.57 ఛార్జీలను పెంచుతూ రూ.10, రూ.40, రూ.60 చేశారు.
చిల్లర పేరుతో సిటీ బస్సుల్లోనూ
చిల్లర సమస్య పేరుతో సిటీ బస్సుల్లోనూ పరోక్షంగా బస్ ఛార్జీలను గతేడాది మేలో పెంచారు.రూ.6 ఉన్న ఛార్జీని రూ.5కు తగ్గిస్తూనే రూ.8, రూ.9 ఉన్న ఛార్జీలను రూ.10కి పెంచారు. రూ.13ను రూ.15కు, రూ.17, రూ.18ని రూ.20కు పెంచేశారు. దీంతో ప్రయాణికులపై టికెట్ మీద రూ.1 నుంచి రూ.2 వరకూ భారం పడింది. ఇలా ఏడాదికి రూ.50 కోట్ల వరకూ ప్రయాణిల నెత్తిన పడింది.
వివిధ పేర్లలో మరింత...
వివిధ పేర్లతో ప్రయాణికుల నెత్తిన మరింత భారాన్ని మోపారు. ప్యాసింజర్ ఎమినిటీస్ ఫండ్ పేరుతో ప్రతి టికెట్ పైనా రూ.1 పెంచారు. టోల్ గేట్ పేరుతో వసూలు చేస్తున్న మొతాన్ని కూడా పెంచి ప్రయాణికులపై భారం మోపారు. తెలుగు వెలుగులో రూ.1 ఉన్న టోల్ గేట్ ఛార్జీని రూ.2కు, ఇతర సర్వీసుల్లో రూ.2 ఉన్న టోల్ ఛార్జీని రూ.5కు పెంచారు. వీటి ద్వారా ఆర్టీసీకి ఏడాదికి రూ.110 కోట్లు సమకూరింది. వీటికి తోడు జీఎస్టీ పేరుతో 18 శాతం పన్నును టికెట్పైన వసూలు చేస్తున్నారు.
డీలక్స్ నుంచి అల్ట్రా డీలక్స్ పేరుతో
డీలక్స్్ పేరుతో నడుస్తున్న బస్సులను 2017 ఆగష్టులో అల్ట్రా డీలక్స్గా పేరు మార్చారు. ఇందులోనూ ప్రయాణికులపై భారాన్ని మోపారు. డీలక్స్ బస్సుల్లో కేవలం సీట్లను మాత్రం మార్పు చేసి అల్ట్రా డీలక్స్ పేరుతో కొత్త సర్వీసులను తీసుకొచ్చారు. 626 డీలక్స్ బస్సులను అల్ట్రా డీలక్స్ బస్సులుగా మార్చారు. డీలక్స్ సర్వీసుల్లో కిలో మీటరుకు 98 పైసలు ఉన్న ఛార్జీని అల్ట్రా డీలక్స్ పేరుతో 110 పైసలు చేశారు. దీంతో ప్రయాణికునిపై కిలోమీటరుకు 12 పైసలు భారం పడింది.
అవసరమైనవి తగ్గించి...
సామాన్యు ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించేది తెలుగు వెలుగు సర్వీసుల్లోనే. అలాంటి తెలుగు వెలుగు సర్వీసులను క్రమంగా తగ్గించేశారు. 300 వరకూ తెలుగు వెలుగు బస్సులను తగ్గించినట్లు ఆర్టీసి ఎమ్డి స్వయంగా వెల్లడించారు. తెలుగు వెలుగు సర్వీసులు తగ్గించడం వల్ల మరో మార్గం లేక సామాన్యులు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోనో లేక ఆటోలు, జీపులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. 2017 మే నాటికి 5238 ఉండగా అవి 2018 నాటికి 5135గా, 2019 నాటికి 5048గా తగ్గిపోయాయి.
కేటాయింపుల్లోనూ అంతే...
సామాన్య ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని తెలుగు వెలుగు బస్సులను ఎక్కువగా కేటాయించాల్సిన ఆర్టీసి వాటిని మాత్రం తగ్గించి కేటాయించి, సామాన్యులు అంతగా ప్రయాణించని అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏపీ బస్సులను అధికంగా కేటాయించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకూ 11 తెలుగు వెలుగు బస్సులను కొత్తగా కేటాయించగా 315 ఎక్స్ప్రెస్, 252 అల్ట్రా డీలక్స్, 209 సూపర్లగ్జరీ, 25 కరోనా(ఏపీి) బస్సులను కేటాయించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి కేవలం 10 తెలుగు వెలుగుబస్సులను కేటాయించి 76 ఎక్స్ప్రెస్, 24 అల్ట్రా డీలక్స్, 109 సూపర్ లగ్జరీ, 10 గరుడ బస్సులను కేటాయించారు.
నష్టాలు ఇలా....
ఆర్టీసి నష్టాలు ఇప్పటికే రూ.1250 కోట్లకు చేరాయని, ఆ నష్టాలను భర్తీ చేయాలంటే ఛార్జీల పెంపు తప్పదని ఆర్టీసి అధికారులు చెబుతున్నారు. ఈ నష్టాలకు కార్మికులు కారణం కాదని ఆ సంస్థ ఎండి స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించిన విధానాలు చర్చనీయాంశంగా మారాయి. ఆర్టీసీికి ప్రభుత్వం నుంచి రాయితీల రూపంలో రూ.650 కోట్లు రావాల్సి ఉంది. గత బడ్జెట్లో కేటాయించిన వాటిలో రూ.250 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినా ఆ మొత్తం ఇప్పటికీ ి అందలేదు. దీంతో పాటు ఆర్టీసి కార్మికులకు 2013 వేతన సవరణ బకాయిలు చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.
అందు కోసం దాదాపు రూ.200 కోట్ల మేర అవసరమవుతుందని అంచనా వేశారు. వీటన్నిటికీ తోడు డీజిల్ రేట్ల పెరుగుదల వల్ల ఆర్టీసీిపై ఏడాదికి రూ.900 కోట్ల భారం పడుతోంది. డీజల్పై రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ను మినహాయించడం ద్వారా కొంత మేరకైనా ఊరట కలిగించాలన్న డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పోలవరం, అమరావతి యాత్రల పేరుతో ప్రభుత్వం బస్సులను పెద్ద ఎత్తున వినియోగించింది. సాధారణ సర్వీసులను కూడా నిలిపేసి యాత్రల కోసం బస్సులను పంపించారు. అయితే బస్సుల అద్దె కోసం చెల్లించాల్సిన మొత్తంలో ఒక్క పైసా కూడా ఆర్టీసికి ప్రభుత్వం ఇప్పటి వరకూ చెల్లించలేదు. ఇది కూడా ఆర్టీసిపై ఆర్థిక భారం పడేలా చేసింది.