Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిప్పుల కొలిమిలా పలు రాష్ట్రాలు
- మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడులలో కరువు ఛాయలు
- రిజర్వాయర్లలో అడుగంటిన నీటి నిల్వలు
- వడగాలులతో అల్లాడుతున్న జనాలు
న్యూఢిల్లీ : భానుడి భగభగలతో దేశం నిప్పుల కొలిమిలా మారింది. ఈ ఏడాది మార్చి నుంచే దంచి కొడుతున్న ఎండలు మే నాటికి తీవ్రమయ్యాయి. దీంతో ప్రజలు ఇండ్లల్లో నుంచి బయిటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. దేశవ్యా ప్తంగా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 'ఫణి' ప్రభావంతో ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలు కొంత చల్లబడ్డా తర్వాత అక్కడా ఇదే స్థితి నెలకొంది. ఎండల ప్రభావం ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలలోనే గాక కొండ ప్రాంతాల రాష్ట్రాలైన హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లలోనూ ఎక్కువగా ఉన్నది. దీంతో ఆయా రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోహిణి కార్తె రాకముందే రోళ్లు పగిలేలా కొడుతున్న ఎండలతో బావులలో నీరు ఇంకి పోయి పట్టణ, గ్రామీణ ప్రాంతాల జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మరోవైపు దేశంలోని అన్ని ప్రముఖ రిజర్వాయర్లలో నీటిమట్టం దాదాపు అడుగంటింది.
ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో ఎండలు మండుతున్నాయి. వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు నానా ఇబ్బందులు పడు తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో విద్యుత్ కోతలు ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇక కరువుకు చిరు నామాగా మారిన మహారాష్ట్రలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు అరేబియా సముద్రం నుంచి వీస్తున్న వడగాలులతో ప్రజలు బయిటకు రావాలంటేనే భయపడుతున్నారు. నాసిక్, విదర్భ, అహ్మద్నగర్, జౌరం గాబాద్, నాగ్పూర్ రీజియన్లలో కరువు పరిస్థితులు నెలకొ న్నాయి. ఈ ఏడాది నవంబర్ నుంచే రాష్ట్రం నీటి సమస్యను ఎదుర్కొంటుండగా.. ప్రస్తుతం అది తీవ్రస్థాయికి చేరింది. ఈనెల 2న విదర్భలోని బ్రహ్మగిరిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం గమనార్హం. గడిచిన నెల రోజులుగా ఉష్ణోగ్రతలు దాదాపు ఇదే విధంగా నమోదవుతున్నాయి. ఇక హిమాచల్ప్రదేశ్లోని ఊనాలో మునుపెన్నడూ లేనంతగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. చల్లని ప్రాంతంగా పేరున్న డెహ్రాడూన్లో 39 డిగ్రీలు రికార్డైంది.
తెలుగు రాష్ట్రాలలోని మణుగూరు, రామగుండం వంటి ప్రాంతాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతుండటం గమనార్హం. కాగా, వచ్చే పదిహేను, ఇరవై రోజుల పాటు ఎండలు ఇలా దంచి కొడతాయని.. ఉష్ణోగ్రతలు మరో 3 నుంచి 4 డిగ్రీలు పెరగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఎండల ప్రభావంతో భావులు, చెరువులు, డ్యాములు, రిజర్వాయర్లలో నీటిమట్టం అడుగంటుతోంది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ప్రకారం.. దేశంలో 91 రిజర్వాయర్లలో నీటి మట్టం 25 శాతం మేరకే ఉన్నదని తెలిపింది.
ఎండలతో పాటు వడగాల్పులతో ప్రజలు అల్లాడుతు న్నారు. గతవారం నుంచి తమిళనాడు, ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిషా, యూపీ, బెంగాల్లతో పాటు ఈశాన్య రాష్ట్రాలలో సైతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడగాల్పులు అధికమై ప్రజలు ఉక్కపోతలతో సతమతమవుతున్నారు. ఎల్నినో ప్రభావంతో దేశంలో జూన్లో వచ్చే నైరుతి రుతు పవనాలు కూడా ఈసారి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ప్రముఖ వాతావరణ అంచనా సంస్థ 'స్కైమేట్' తెలిపింది. జూలై, ఆగస్టులలో వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో, రైతులు వానల కోసం మరిన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తనుంది.
- ఉత్తర, తూర్పు తెలంగాణల్లో వడగాలులు
- అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం
- ఈ వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం
ఉత్తర, తూర్పు తెలంగాణల్లో రాబోయే రెండుమూడ్రో జుల పాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్నది. మరోవైపు అదే సమయంలో అక్కడక్కడా చెదురుముదురు జల్లుల నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశమున్నదని వాతావరణశాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమురం భీమ్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నది. ఈ క్రమంలోనే నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో పాటు ఉరు ములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశమున్నది. శనివారం నాడు రాష్ట్రంలో ఖమ్మంలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. గాలిలో తేమ శాతం రోజురోజుకీ క్రమంగా తగ్గిపోతున్నది. నల్లగొండ జిల్లాలో అత్యల్పంగా 16 శాతం తేమ మాత్రమే నమోదైంది. ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో 18 శాతం నమోదు అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నది. ఉత్తర ఇంటీరియర్ ఒడిశా నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని వాతావరణ శాఖ తెలిపింది.