Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ యువమోర్చా నాయకురాలి అరెస్టు
కోల్కతా : లోక్సభ ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు భౌతికంగా దాడులకు దిగుకుంటూ పశ్చిమ బెంగాల్లో అల్లర్లు సృష్టింస్తోన్న బీజేపీ, తృణమూల్ పార్టీలు సామాజిక మాధ్యమాన్ని సైతం వదలటం లేదు. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మార్ఫింగ్ ఫోటోను సామాజిక మాధ్యమంలో షేర్ చేసిన ఘటనలో బీజేపీ యువమోర్చా నాయకురాలిని పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ యువమోర్చా హౌరా కన్వీనర్గా ప్రియాంకశర్మ ఉన్నారు. ఇటీవల 2019 మెట్ గాలా కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఫోటోతో మమతా బెనర్జీ చిత్రాన్ని మార్ఫింగ్ చేసిన ఒక పోస్ట్ను సామాజిక మాధ్యమంలో కొందరు పోస్ట్ చేశారు. ఆ ఫోటోను ప్రియాంకశర్మ సామాజిక మాధ్యమంలో షేర్ చేసింది. దీంతో ఆమెకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావాలనే మమతా బెనర్జీ ఫోటోను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారని తృణమూల్ ఆరోపించింది. దీంతో పోలీసులు ప్రియాంకశర్మను అరెస్టు చేశారు. సెక్షన్ 500, సెక్షన్ 66ఎతో పాటు నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కాగా, ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. బీజేపీతో కలిసి పనిచేస్తున్నదన్న కారణంతోనే తన కూతురుపై ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రియాంకశర్మ తల్లి ఆరోపించారు.