Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భోపాల్ గ్యాస్ బాధితులను ఆదుకోవడంలో బీజేపీ విఫలం
- వేచిచూస్తున్న బాధిత కుటుంబాలు
భోపాల్ : ముప్పై ఐదు ఏండ్లు గడుస్తున్నా భోపాల్ గ్యాస్ బాధితులింకా న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. 1984 డిసెంబర్ 2 న జరిగిన ఈ దారుణ ఘటనలో దాదాపు 3,800 మంది చనిపోగా విషవాయువులు పీల్చిన 5 లక్షల మంది ఆపన్నహస్తం కోసం కండ్లు కాయలు కాసేలా చూస్తూనే ఉన్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ కొద్దిరోజుల నుంచి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. (ఈ ఉదంతం ఆయన హయాంలోనే చోటుచేసుకుంది) ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ.. భోపాల్ గ్యాస్ బాధితులకు 'న్యాయం' ఎవరు చేస్తారు అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ తీసుకొచ్చిన సార్వత్రిక కనీస ఆదాయ పథకాన్ని (న్యారు) ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముప్పై ఐదు ఏండ్లు గడిచినా బాధితులింకా న్యాయం కోసం వేచిచూస్తున్నారని ప్రధాని మొసలికన్నీరు కాల్చారు. రాజీవ్ గాంధీ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఓట్లు అడగగలదా అని మోడీ ప్రశ్నించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ ముప్పై ఐదేండ్ల కాలంలో దాదాపు మూడు పర్యాయాలు రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. కేంద్రంలోనూ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి (1999-2004) ఓసారి అధికారం చేపట్టగా గడిచిన ఐదేండ్లూ బీజీపీనే పాలించింది. సంపూర్ణ మెజారిటీతో అధికారం చేపట్టిన మోడీ.. తమకు చేసింది శూన్యమని భోపాల్ బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. కాంగ్రెస్ మాదిరిగానే బీజేపీ సైతం తమను ఓట్ల కోసం వాడుకున్నదని వారు ఆరోపిస్తున్నారు. బాధితుల కోసం కేటాయించిన నిధులను సైతం బీజేపీ దారి మళ్లించి.. వాటిని ఆరెస్సెస్ శాఖా కార్యాలయాల కోసం వాడుకోవడం గమనార్హం.
భోపాల్ బాధిత కుటుంబాలకు శాశ్వత గృహాలు నిర్మించడానికని రూ. 40 కోట్లు కేటాయించాలని 2010లో నాటి రాష్ట్ర మంత్రివర్గం (శివరాజ్సింగ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు) కేంద్రాన్ని కోరింది. వీటిని 'భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ అండ్ రీహాబిటేషన్'కు మళ్లించింది. 2016లో ప్రధాని తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద వాటిని నిర్మిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ, బాధితులకు ఇంతవరకూ ఒక్క ఇంటినీ నిర్మించలేదు. ఇక, వారికి ఉచితంగా ఆరోగ్య సదుపాయం కల్పించాలని 2004లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా దానిపైనా బీజేపీ సర్కారు నిర్లక్ష్యమే వహించింది.
బాధితుల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రులు కట్టించి ఇవ్వాలని ప్రతిపాదన ఉన్నా ఇప్పటికీ ఆ భవనాలు పునాది దశనే దాటలేదు. దీంతోపాటు బాధితుల స్వాంతన కోసం 36 మున్సిపాలిటీ వార్డులలో యోగా సెంటర్లు కట్టించి ఇవ్వాలని 2010లో రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించింది. కానీ 2016 నాటికి అందులో కట్టించినవి అక్షరాలా ఏడు మాత్రమే. వీటికి రూ. 3.68 కోట్లను వెచ్చించిందీ బీజేపీ సర్కారు. అనంతరం వీటిని ఫంక్షన్ హాళ్లుగా మార్చి ఆరెస్సెస్ నాయకులకు కట్టబెట్టింది. వీటిలో ఏ ఒక్కటీ బాధితులకు ఉపయోగపడటం లేదని భోపాల్ గ్యాస్ బాధితుల తరఫున పోరాడుతున్న 'ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ ఫర్ జస్టిస్ ఇన్ భోపాల్' ప్రతినిధులు తెలిపారు.
భోపాల్ ఉదంతానికి కారకుడైన యూనియన్ కార్బేడ్ కార్పొరేషన్ (యూసీసీ) సంస్థ అధినాయకుడు వారెన్ ఆండర్సన్ (2014లో ఆయన చనిపోయారు)ను ఇండియాకు తీసుకొచ్చి విచారణ చేపట్టాలని ప్రజలు ఆందోళనలు చేపట్టినా కాంగ్రెస్, నాటి వాజ్పేయి ప్రభుత్వాలూ ఇందుకోసం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. కాగా, బాధితులకు న్యాయం చేయని మోడీ, శివరాజ్సింగ్ సర్కారులు.. ఆ ఉదంతాన్ని ఇంకా ఉపయోగించుకోవడం ఎన్నికలలో లబ్ది పొందడానికేనని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.