Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంపై సుప్రీంకోర్టు ఫైర్
- 2014 ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న నగదు వెనక్కి ఇచ్చేశామన్న సర్కారు
న్యూఢిల్లీ : ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు కళ్లెం వేయటంలో కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై సుప్రీంకోర్టు మండిపడింది. గత సార్వత్రిక ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న నగదును వెనక్కి ఇచ్చేశామని, వందల కేసుల్లో కేవలం ముగ్గురిపైనే కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ దాఖలు చేసిన అఫిడవిట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే వారి డబ్బును ఎన్నికలు ముగిశాక, నెల రోజులు భద్రంగా దాచిపెట్టి అప్పగించారా? అని ప్రశ్నించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రూ. 303.86 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని కేంద్రం ఆ అఫిడవిట్లో తెలిపింది. అయితే సదరు నిందితుల ఆదాయ వనరులను సమీక్షించాక స్వాధీనం చేసుకున్న నగదును తిరిగి వారికి అప్పగించామని వివరించింది.
ఈ సందర్భంగా ఎన్నికల్లో ధనప్రవాహం, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల వైఫల్యాలపై న్యాయమూర్తులు ఎన్వి రమణ, ఎంఎం శాంతనగోదర్ల ధర్మాసనం ఆందళనను వ్యక్తపరిచింది. వెంటనే అక్రమ నగదు స్వాధీనం, క్రిమినల్ కేసుల పురోగతికి సంబంధించిన వివరాలు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా, క్రిమినల్ కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తున్నందున వాటికి సంబంధించిన సమాచారం తమ దగ్గర లేదని కేంద్రం తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఆర్ బాలసుబ్రమణ్యం తెలిపారు. అంత పెద్దమొత్తంలో నగదు పట్టుబడినా.. దానికి సంబంధించిన కేసులపట్ల రాష్ట్రాలతో, ఎన్నికల కమిషన్తో కేంద్రం సమన్వయంలో ఉండదా? పట్టుబడిన నగదుకు, ఎన్నికలకు సంబంధమే లేదని కేంద్రం భావిస్తున్నదా? అని ధర్మాసనం ఆగ్రహించింది. ఎన్నికల్లో ధనప్రవాహం గురించి మీకు ఏమీ తెలిసినట్టు లేదు.. ఆ బాధ్యతలనూ ఈసీకి అప్పగించాల్సిందేనేమోనని వ్యాఖ్యానించింది. కాగా, తనిఖీలకు సంబంధించి ఈసీతో సమాచారాన్ని పంచుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాసినా స్పందనలేదని సీనియర్ అడ్వకేట్ రాకేశ్ ద్వివేది ధర్మాసనానికి తెలిపారు. 'తనిఖీలు చేశాక, నగదు స్వాధీనం చేసుకున్నాకా మీరు ఏ చర్యలూ తీసుకోరు. ఈసీతోగానీ, కోర్టుతోగానీ సహకరించరు. మీరు బాధ్యతగా వ్యవహరించకుండా ఈసీ లేఖకు స్పందించలేదు.
ప్రభుత్వం స్పందించే విధానమిదేనా?'అని కేంద్రంపై ధర్మాసనం మండిపడింది. తాము ఐటీ చట్టం ఆధారంగానే తనిఖీలు చేశామని, దానికి ఎన్నికల సమయంతో సంబంధంలేదని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. 2014లో కర్నాటకలోని బళ్లారి లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతుండగా.. రూ. 20 లక్షల నగదు పట్టుబడిన కేసులో నిందితుడిపై అభియోగాలకు సరైన ఆధారాల్లేవని హైకోర్టు ఎఫ్ఐఆర్ను తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్నాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారిస్తున్నది. ఇందులో భాగంగానే 2014 ఎన్నికల్లో నగదు స్వాధీనానికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.