Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం నవీన్ పట్నాయక్ డిమాండ్
భువనేశ్వర్ : ఒడిషాకు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిం చాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదివారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల సంభవించిన ఫోని తుఫాను కారణంగా 41 మంది మృతి చెందడంతో పాటు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రతి ఏడాది ప్రకృతి విపత్తులు కబలించి వేస్తున్నాయని చెప్పారు. తుఫాన్ విధ్వంసం అనంతరం ఆయన తొలిసారిగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫోని తుఫాన్ కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, మౌలిక సౌకర్యాలు దెబ్బతినడమే కాకుండా అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. ఈ నేపధ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. '' కేంద్రం నుండి మేము పొందిన సాయంతో తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగింది. రాష్ట్ర నిధుల నుండి అధిక మొత్తంలో కేటాయింపులు జరిపి దీర్ఘకాలం శ్రమిస్తేగాని పరిస్థితులు చక్కబడవు'' అని పట్నాయక్ అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్ధపై తీవ్రమైన ఒత్తిడి పడుతోందన్నారు. ఒడిషాకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గడిచిన ఐదేండ్లలో ఫలిన్, హుదుద్, తిత్లితో పాటు ఇప్పుడు ఫొని తుఫాన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని చెప్పారు.