Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగాల్లో హింసాత్మకం..
- తృణమూల్, బీజేపీ పరస్పర దాడులు
- ఢిల్లీ, యూపీలలో ఈవీఎంల మొరాయింపులు
- 63.30 శాతం పోలింగ్...
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆరో దశ పోలింగ్లోనూ బెంగాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 59 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరిగింది. మొత్తం 63.30 శాతం పోలింగ్ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అత్యధికంగా బెంగాల్లో 80.16 శాతం ఓటింగ్ నమోదుకాగా అత్యల్పంగా యూపీలో 53.37 శాతం పోలింగ్ నమోదైంది.
బెంగాల్లో అదే కథ..
పశ్చిమ బెంగాల్లో వివిధ ప్రాంతాల్లో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. ఘటాల్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి భారతీ ఘోష్పై టీఎంసీ మహిళా కార్యకర్తలు దాడికి యత్నించారు. నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన భారతిని చుట్టుముట్టిన టీిఎంసీ కార్యకర్తలు.. ఆమెకు వ్యతిరేక నినాదాలు చేశారు. ఆమె మరో పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అక్కడ కూడా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. భారతి వాహనంపైనా కొందరు దాడికి పాల్పడ్డారు. తూర్పు మిడ్నాపూర్లోని భగబన్పూర్లో ఇద్దరు బీజేపీి కార్యకర్తలపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఝూర్గామ్ జిల్లా గోపిబబ్లాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త రమణ్సింగ్.. పోలింగ్కు కొన్ని గంటల ముందు తన ఇంట్లో హత్యకు గురయ్యాడు. పురులియా జిల్లాలోని మదప్పూర్, బొర్టార్ గ్రామాలలో ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. తమ గ్రామాలలో కనీస సదుపాయాలు కల్పించడంలో మమత సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రమంత్రి, సుల్తాన్పూర్ బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ, తన ప్రత్యర్థి సోనూసింగ్ల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం పిలీభీత్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మేనకా గాంధీ ఈ ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి బరిలో ఉన్నారు. ఆ స్థానం నుంచి ఎస్పీ, బీఎస్పీ కూటమి అభ్యర్థి సోనూసింగ్ బరిలో ఉన్నారు. మేనకాగాంధీ... ఎస్పీ, బీఎస్పీ నాయకులు ఓటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ రౌడీయిజం ఇక్కడ పని చేయదని సోనూ సింగ్ను ఉద్దేశించి మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఖండించిన సోనూ సింగ్ తాను ఏ తప్పు చేశానో చెప్పాలంటూ మేనకాగాంధీని ప్రశ్నించారు. ఈ సమయంలో సోనూ సింగ్ అనుచరులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇరువురు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది. బీహార్లోని వెస్ట్ చంపారన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సంజరు జైస్వాల్పై గుర్తు తెలియని దుండగులు దాడికి యత్నించారు.
ఈవీఎంల మొరాయింపులు
ఆరో దశలో భాగంగా ఢిల్లీలో అన్ని స్థానాలకు నిర్వహించిన ఎన్నికలలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మాల్వీయనగర్లోని 84, 88, 86, 126, 117 పోలింగ్ బూత్లతో పాటు న్యూ అశోక్ నగర్, బబర్పూర్, గ్రీన్పార్క్లలోని పోలింగ్ కేంద్రాలలో ఈ సమస్యలు తలెత్తాయి. దీంతో, ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చింది. ఢిల్లీతో పాటు యూపీలోని ఆజంగఢ్లోని పలు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయి.
రాష్ట్రాలవారీగా పోలింగ్ నమోదు పరిశీలిస్తే... బీహార్(8) లో 59.29శాతం, ఢిల్లీ(7)లో 56.11 శాతం, హర్యానా(10)లో 62.91 శాతం, జార్ఖండ్(4)లో 64.46 శాతం, మధ్యప్రదేశ్(8)లో 60.40 శాతం పోలింగ్ జరిగింది. ఆరోదశతో కలుపుకుని ఇప్పటి వరకు మొత్తం 483 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన 59 స్థానాలకు చివరి దశలో మే19న పోలింగ్ జరగనున్నది.
ఓటేసిన ప్రముఖులు
ఆరో దశ పోలింగ్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, నిటి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, మేనకా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ సీఎం షీలా దీక్షిత్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ సంచార్ భవన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.