Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సున్నితమైన సైనిక సమాచారాన్ని బయటపెట్టారు
- అన్నింటికీ అతీతులమని ప్రధాని, అమిత్ షా భావన:ఈసీకి లేఖ రాసిన సీతారామ్ ఏచూరి
న్యూఢిల్లీ : అత్యంత రహస్యంగా ఉంచాల్సిన సైనిక ఆపరేషన్ల సమాచారాన్ని ప్రధాని మోడీ బయటపెట్టారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి ఆరోపించారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఇదంతా చేస్తున్నారనీ, ఎన్నికల నిబంధనల్ని ఆయన ఉల్లంఘించారనీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. సైనిక అంశాల్ని, సైన్యాన్ని ఎన్నికల ప్రచారంలో తీసుకురావద్దని మొదటిరౌండ్ పోలింగ్కు ముందే ఈసీ ప్రకటించిన విషయాన్ని ఈ లేఖలో గుర్తుచేశారు. శనివారంనాటి ఇంటర్వ్యూలో మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. బాలాకోట్ ఆపరేషన్ చేపట్టిన విధానం గురించి ప్రధాని మాట్లాడారనీ, రక్షణశాఖ నిపుణుల్ని సైతం కాదని ఆపరేషన్పై తాను ముందుకు వెళ్లినట్టు అందులో ప్రధాని తెలిపారనీ, తద్వారా సున్నితమైన సమాచారాన్ని బయటపెట్టారనీ ఏచూరి ఆరోపించారు. ఓటర్లను ప్రలోభపెట్టడం కోసం ప్రధాని వ్యవహరించిన తీరును లేఖలో తప్పుబట్టారు.
ఈ లేఖలో ఏచూరి పేర్కొన్న విషయాలు ఇలా ఉన్నాయి...ఎన్నికల నిబంధనల్ని ప్రధాని మోడీ ఉల్లంఘించారు. దీనిపై ఈసీ వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోడీ వ్యవహరిస్తున్న తీరు మనదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తనకు వర్తించదన్నట్టుగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారు. ప్రతీ చోటా సైనిక అంశాల్ని ప్రధాని ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు. ఉగ్రవాద నిర్మూలన అంతా తానే చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఎన్నికల సంఘం, వాటి నిబంధనల్ని లెక్కచేయకుండా ప్రధాని మోడీ, అమిత్ షాలు వ్యవహరిస్తున్నారు. వీటిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందనీ, ఈ ఆరోపణలపై ఈసీ వెంటనే దృష్టి సారించాలనీ ఆయన లేఖలో కోరారు.