Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జన్యు మార్పిడి పంటలపై నిరవధిక నిషేధం బేఖాతర్..
- హర్యానాలో ఆ విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై అయోమయం..!!
- దర్యాప్తునకు రైతు సంఘాల డిమాండ్
న్యూఢిల్లీ: జన్యుమార్పిడి(జీఎం) విత్తనాలేమీ తాము నిల్వ చేయలేదని ప్రభుత్వ నియంత్రణ సంస్థ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్(ఎన్బీపీజీఆర్) తెలిపింది. 2010లో బీటీ వంకాయ విత్తనాల అమ్మకంపై నిరవధిక నిషేధం విధించడానికి ముందు క్షేత్రస్థాయి విచారణను ఈ సంస్థ నిర్వహించింది. జన్యు మార్పిడి విత్తనాలను భారత్లో ప్రవేశపెట్టే అంశం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నిషేధాన్ని ఉల్లం ఘిస్తూ కొన్ని కంపెనీలు బీటీ వంకాయ విత్తనా లను హర్యానాలో అమ్ముతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీటీ వంగడాల వల్ల సాధారణ (సహజ) రకం వంకాయలు కలుషితమవుతాయని పర్యావర ణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ రకం వంకాయ విత్తనాలను జన్యుమార్పిడి చేయడం ద్వారా బీటీ వంకాయ రకాన్ని రూపొందించారు. బ్యాసిల్లస్ తురింగియెన్సిస్(బీటీ) అనే మట్టిలో ఉండే బ్యాక్టీరియాలోని క్రై-1 ఏసీ అనే జన్యువును సాధారణ వంకాయ జీనోమ్లోకి చొప్పించడం ద్వారా దీనిని రూపొందించారు. కొన్ని రకాల తెగుళ్లను తట్టుకునే శక్తి ఈ బీటీ రకం వంకాయ మొక్కలకు ఉంటుంది.
ప్రయివేట్ విత్తన అభివృద్ధి సంస్థ మహారాష్ట్ర హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ ప్రయివేట్ లిమిటెడ్ (మరుకో), తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్(ధార్వాడ్).. బీటీ వంకాయపై విచారణ జరిపి విత్తనాలను సేకరించాయి. జెనెటిక్ ఇంజి నీరింగ్ మదింపు కమిటి 2010 ఫిబ్రవరి 17, మే 12న సమావేశమైంది. ఈ కమిటీ తన మినిట్స్లో పేర్కొన్న ప్రకారం బీటీ వంకాయ విత్తనాలను పై మూడు విత్తన అభివృద్ధి సంస్థల నుంచి తీసుకొని ఎన్బీపీజీఆర్ నిల్వ చేయాలి. విత్తనాల తయారీ కంపెనీ నుంచి, విచారణ సంస్థల నుంచి అఫిడవిట్లను కూడా తీసుకోవాలి. అయితే, ఆ పని ఎన్బీపీజీఆర్ ఇప్పటికీ చేయలేదని, ఆ విత్తనాలు అభివృద్ధి సంస్థల వద్ద ఇంకా అలాగే ఉన్నాయని తేలింది.
ఫతేబాద్ నుంచి బీటీ వంకాయ శాంపిళ్లను పరీక్షల కోసం గత వారం తెప్పించామని ఎన్బీపీజీఆర్ డైరెక్టర్ కుల్దీప్సింగ్ తెలిపారు. అయితే, హర్యానా ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పరీక్ష ఫలితాలను తాము ఎవరితోనూ పంచుకోలేమని ఆయన తెలిపారు. పరీక్ష నివేదికలు తమకు ఇంకా అందలేదని హర్యానా ఉద్యానవన అధికారులు కూడా తెలిపారు. అయితే, గత నెలలో ఫతేబాద్లోని జీవన్షైనీ అనే రైతు వ్యవసాయ క్షేత్రం నుంచి తీసుకున్న శాంపిళ్లను పరీక్షించగా, బీటీ క్రై-1 ఏసీ ప్రోటీన్ ఉన్నట్టు తేలిందని జీఎం రహిత సేంద్రీయ వ్యవసాయ ప్రోత్సాహక రైతు సంఘాల సమాఖ్య తెలిపింది. ఈ విత్తనాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఉంటాయని లేదా పాత విత్తనాలనే నాటి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. సమీప క్షేత్రాల్లోని సాధారణ వంకాయ రకంతో బీటీ రకం సంకర ఫలదీకరణ చెందడం ద్వారా కాలుష్యం విస్తరించి ఉంటుందని సేంద్రీయ రైతు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జాతీయస్థాయిలో శాస్త్రవేత్తలు, రైతులు, ఇంకా సంబంధిత నిపుణులతో సంప్రదింపుల అనంతరం బీటీ వంకాయపై నిరవధిక నిషేధాన్ని 2010 ఫిబ్రవరిలో యూపీఏ ప్రభుత్వంలోని పర్యావరణశాఖ మంత్రి జైరామ్ రమేశ్ ప్రకటించారు. బీటీ వంకాయ మనుషుల ఆరోగ్యానికీ, జీవ వైవిధ్యానికీ, పర్యావర ణానికీ హాని చేయదని శాస్త్రీయ, స్వతంత్ర అధ్య యనం ద్వారా తేలేవరకూ నిషేధం కొనసాగుతుం దని ఆ సందర్భంగా జైరామ్ రమేశ్ స్పష్టం చేశారు. నిషేధానికి ముందు తాము నిల్వ చేసిన బీటీ వంకాయ విత్తనాలను సురక్షితంగా ఉంచామని, నియంత్రణ సంస్థలకు ఆమేరకు సమాచారమిచ్చి నట్టు మరుకో గ్రో అధికార ప్రతినిధి తెలిపారు. బీటీ వంకాయ విత్తనాలు తమ ఆధీనంలో భద్రపరిచా మని తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్చాన్సలర్ ఎన్ కుమార్ తెలిపారు. మూడేండ్ల తర్వాత అవి మొలకెత్తే అవకాశముండదని ఆయన చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం బీటీ వంకాయకు అనుమతిని నిరాకరించిందని ఆయన తెలిపారు. హర్యానాలో లభించినవి బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఉంటాయని ఆయన అన్నారు. 2013 నుంచి బంగ్లాదేశ్లో బీటీ వంకాయను పండిస్తున్నారు. హర్యానాలో బీటీ వంకాయపై దర్యాప్తు జరిపిం చాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశీయ వంగడాలు కలుషితమై ఉంటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.
చట్టాన్ని అతిక్రమించి ముందుగా విత్తనాలను జారవిడుచు, సాగును కలుషితం చెయ్యి, వ్యాప్తి చెయ్యి, అనుమతి ఇచ్చేందుకు తప్పనిసరి పరిస్థితిని సృష్టించు.. అనే వ్యూహాన్ని జీవ సాంకేతిక పరిశ్రమ అనుసరిస్తున్నది...
- కవితా కూరుగంటి, అలయెన్స్ ఫర్ సస్టెయినెబుల్ అండ్ హౌలిస్టిక్ అగ్రికల్చర్ కన్వీనర్