Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి దాఖలైన మధ్యంతర పిటిషన్ను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జులై ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది. ఈ ప్రాజెక్టుపై హర్షవర్థన్ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ రఘువేంద్ర ఎస్ రాథోడ్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. తాగు నీటి ప్రాజెక్టుగా పేర్కొంటూ సాగు నీటి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చేపడుతున్నారని హర్షవర్ధన్ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను ఆదేశించి, కమిటీలు వేయాలని... నివేదికలు తెప్పించి చర్యలు చేపట్టాలని ట్రిబ్యునల్ ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. అయితే, సాగు నీటి ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా కడుతున్నారని పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రవణ్ కుమార్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై గతంలో కూడా ఒక పిటిషన్ ధర్మాసనం వద్ద ఉందని... దానిపై ట్రిబ్యునల్ ధర్మాసనం విచారణ, వాదనలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం తరపున న్యాయవాది సంజరు కుమార్ ట్రిబ్యునల్కు తెలిపారు. ఒరిజినల్ పిటిషన్ జూన్ ఎనిమిదో తేదీన విచారణకు రానున్న నేపథ్యంలో దానితోనే పూర్తి విచారణ జరపాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. పూర్తి వాదనలు విన్న తర్వాత ట్రిబ్యూనల్ బెంచ్... కేసు విచారణను వాయిదా వేసింది. ఆ కేసు విచారణతోనే దీన్ని కూడా విచారణ చేపడుతామన్నారు. కేసు విచారణకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తరపున న్యాయవాదితో పాటు ముఖ్య ఇంజనీర్ రమేష్ కూడా హాజరయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జులై పదికి వాయిదా
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను జులై పదో తేదీకి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని హయాతుద్దీన్ అనే ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ సవాల్ చేస్తూ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విజ్ఞప్తిని విచారణకు జస్టిస్ రాఘవేంద్ర నేతృత్వంలోని ట్రిబ్యూనల్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఫిర్యాదుదారు తరఫున న్యాయవాది కేసు విచారణకు హాజరు కాని నేపథ్యంలో విచారణను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.