Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ
- న్యాయమైన నష్టపరిహారం కోసం రైతులు డిమాండ్
- నిద్రలేకుండా చేస్తున్న బుల్లెట్ రైలు, జాతీయరహదారి ప్రాజెక్టులు
అభివృద్ధి ప్రాజెక్టులను రైతులు కాదనటం లేదు. అడ్డుకుంటామని చెప్పటమూ లేదు. ప్రాజెక్టు కింద భూమిని కోల్పోయినందుకు చట్ట ప్రకారం న్యాయమైన నష్టపరిహారాన్ని కోరుకుంటున్నారు. అభివృద్ధి పేరుజెప్పి ఎకరాలకు...ఎకరాలు లాగేసుకుంటే రైతు బతికేదెట్టా ? అన్న ప్రశ్నకు గుజరాత్లో అధికార బీజేపీ నాయకుల నుంచి సమాధానం కరువైంది. ముఖ్యంగా దక్షిణ గుజరాత్లో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎప్పుడు ఏ అభివృద్ధి ప్రాజెక్టు తమ నెత్తిమీద పిడుగులా పడుతుందో అన్న భయంతో బతుకుతున్నారు.
న్యూఢిల్లీ : వడోదర్-ముంబయి ఎక్స్ప్రెస్ హైవే, భారత్మాతా ప్రాజెక్ట్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్(డీఎఫ్సీ), బుల్లెట్ ట్రైన్...ఇలా వందలాది అభివృద్ధి ప్రాజెక్టులు రైతులకు నిద్రలేని రాత్రుల్ని తెచ్చిపెట్టాయి. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒకసారి 2013 భూసేకరణ చట్టం, మరోసారి 2016(సవరణ)చట్టం అమ లుజేస్తామని చెబుతోంది. నిబంధనలకు నిర్వచనాలు ఒక్కోచోట ఒకలా ఉంటాయి. గందరగోళాన్ని సృష్టించి రైతును మభ్యపెట్టే ఎత్తుగడలను ప్రభుత్వం ప్రయోగిస్తోంది. ఇలాంటి పరిస్థితి వల్ల ఇప్పటివరకూ 6వేల మంది రైతులు, వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వారి డిమాండ్లను, ఆందోళనను పట్టించుకునే నాథుడే లేడు.
'జాతీయ రహదారి-48' నిర్మాణం కోసం ఎంతోమంది రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరించారు. అలా భూమిని కోల్పోయినవారిలో ప్రకాశ్చంద్ర దేశారు ఒకరు. నవసారీ జిల్లా అమోద్పోర్ అనే గ్రామంలో దేశారుకు ఉన్న ఎకరం భూమిలో పావువంతు జాతీయ రహదారి కోసం ప్రభుత్వం లాక్కుంది. మరోపావు ఎకరం ప్రధాని నరేంద్రమోడీ ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన 'బుల్లెట్ ట్రైన్' ప్రాజెక్టుకు పోయింది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమై రెండేండ్లు అయినా దేశారుకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తున్నారన్నది అధికారులు తేల్చలేకపోయారు. ఇదీ గుజరాత్లో బీజేపీ పాలనాతీరు. ఎదురుతిరుగుతున్న ఎనిమిది గ్రామాల్లోని దాదాపు 40మందికిపైగా రైతుల్ని ప్రభుత్వం, అధికారులు వివిధ రకాలుగా భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
రైతుల్ని వణికిస్తున్న బుల్లెట్ రైలు
అహ్మదాబాద్-ముంబయి 'బుల్లెట్ ట్రైన్' ప్రాజెక్టు వ్యయం రూ.లక్షా 10వేల కోట్లు. ఇందులో జపాన్ రూ.88వేలకోట్లు అప్పుగా ఇస్తోంది. మిగిలిన మొత్తాన్ని మహారాష్ట్ర, గుజరాత్ భరిస్తున్నాయి. 2022కల్లా ప్రాజెక్టును పూర్తిచేయాలి. బుల్లెట్ ట్రైన్ మార్గం పొడవు 508 కిలోమీటర్లు. గుజరాత్లోని 8 జిల్లాల గూండా ఈరైలు వెళ్లాల్సి ఉంటుంది. రైలుమార్గం నిర్మాణం కోసం ఒక్క గుజరాత్లోనే 1002.6హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. 2018, డిసెంబరు 31లోగా భూసేకరణ కార్యక్రమం ముగించాలన్నది లక్ష్యం. అయితే రైతుల నుంచి వస్తోన్న వ్యతిరేకత, ఆందోళన రోజు రోజుకీ పెరిగిపోతోంది.
పార్లమెంట్ చేసిన 2013 భూసేకరణ చట్టం, గుజరాత్ ప్రభుత్వం చేసిన 2016 సవరణ చట్టం...ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకొని రైతులకు నష్టపరిహారం ఇస్తున్నామని బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ 2016చట్టంలో కొన్ని పైకి కనిపించని లొసుగులు ఉన్నాయని రైతులు, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు, రైతు సంఘాలు '2016 భూసేకరణ(సవరణ)'చట్టాన్ని ఆరాష్ట్ర హైకోర్టులో సవాల్ చేశారు. 250మంది రైతులు పిటిషన్లు వేశారు.
చేతులు దులుపుకునే విధంగా ఉంది :
ప్రఫుల్ భట్, వడోదర రైతు
''బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కారణంగా 2500మంది రైతుల కుటుంబాలు ప్రభావితమవుతున్నాయి. జాతీయ రహదారి ప్రాజెక్టు వల్ల ఎకరన్నరకుపైగా భూమి పోయింది. ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టులో మరో ఎకరం భూమి కోల్పోయా. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కింద మరికొంత భూమిని సేకరిస్తున్నారు. అక్కడ కొంత, ఇక్కడ కొంత ఇచ్చేసి చేతులు దులుపుకునే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు''నివాస ప్రాంతాల్లోనివారిని సైతం 'బుల్లెట్ రైలు' ప్రాజెక్టు ప్రభావితం చేసింది. 14,884మంది మరోప్రాంతానికి తరలాల్సి వచ్చింది. నివాస ప్రాంతాల్ని కోల్పోయి మరోచోటకి తరలివెళ్లినవారిలో 39శాతం ఎస్టీ, 5,262 ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కుటుంబాలు ఉన్నాయి. 14శాతం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, మహిళల పేర్లతో ఉన్న ఇండ్లు 17శాతం ఉన్నాయి. అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో సాగుతున్న భూసేకరణ ఎక్కడా కూడా చట్టానికి అనుగుణంగా సాగటం లేదని పౌరహక్కుల, రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. పాలకులు నిబంధనల్ని ఇష్టారాజ్యంగా అమలుజేస్తున్నారని వారు కోర్టు గడపతొక్కుతున్నారు.