Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మూకాశ్మీర్లో ఘటన
- వెల్లువెత్తిన ఆగ్రహం
శ్రీనగర్ : ఉత్తర జమ్మూకాశ్మీర్ బండిపొర జిల్లాలో మూడేండ్ల బాలికపై దారుణం జరిగింది. విషయం వెలుగులోకి రావటంతో కాశ్మీర్ లోయ వ్యాప్తంగా స్థానికులు పెద్దఎత్తున నిరసనకు దిగారు. అలాగే, ఈ ఘటనకు నిరసనగా ఇతేహదుల్ ముస్లిమీన్ సంస్థ కాశ్మీర్ వ్యాలీలో సోమవారం బంద్కు పిలుపునిచ్చింది. దాంతో కాశ్మీర్ వ్యాలీ వ్యాప్తంగా నిందితుడికి కఠిన శిక్ష విధించాలంటూ స్థానికులు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేశారు. ఘటనకు నిరసనగా పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రజారవాణా కూడా స్థంభించింది. కాగా, ప్రభుత్వకార్యాలయాలు, బ్యాంకుల్లో కార్యకలాపాలు కొనసాగాయి. ఈ నెల 9న సుంబల్ ప్రాంతంలో ఘటన జరుగగా, ఘటనపై దర్యాప్తునకు జమ్మూకాశ్మీర్ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఘటనను ఖండిస్తూ బంద్కు మద్దతు ప్రకటించాయి.
రాళ్ళతో కొట్టిచంపాలి : ముఫ్తీ
ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పీడీపీ చీఫ్, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఉదంతంలో షరియా చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని ఆమె ట్వీట్ చేశారు. ఈ దారుణ ఘటన వినడానికే తనకు సిగ్గుగా ఉందని, లైంగిక దాడి ఘటనలపై కొందరు మహిళలే నిందితులను ప్రేరేపించేలా వ్యవహరిస్తారని సమాజం తరచూ నిందిస్తుందని. మరి ఈ చిన్నారి ఏం తప్పు చేసిందని మెహబూబా ముప్తీ ప్రశ్నించారు. ఇలాంటి వారిని షరియా చట్టం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని తెలిపారు.